దేశంలో గోల్ మాల్ గోవిందం గాళ్లు మోపు అయ్యారని.. దేశాన్ని ఆగం పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ వనపర్తి సభలో అన్నారు. ప్రజలకు మత పిచ్చి లేపి.. కుల పిచ్చి లేపి.. దుర్మార్గమైన చర్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజకీయాలను మంట కలుపుతున్నారు. చైతన్యం ఉన్న గడ్డగా.. తెలంగాణ బిడ్డగా నా కంఠంలో ప్రాణం ఉండగా అటువంటి అరాచకం తెలంగాణలో రానివ్వను. మనందరం కూడా ఆ పోరాటానికి సిద్ధంగా ఉండాలి. కులం, మతం, జాతి లేకుండా ప్రజలంతా బాగుపడాలన్నారు.
ఒకనాడునేను చెప్పిన. నన్ను అవమానించారు ఆరోజు. నేను చెప్పిన ప్రతి మాట.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నిరూపించి చూపించా. ఇదే ప్రగతి దేశమంతటా రావాలి. దేశం బాగుపడితే ఇంకా మనం కూడా బాగుపడతాం. అందుకే దేశం కోసం పోరాటానికి ముందుకు పోవాలి. పోదామా.. దేశం కోసం పోరాటానికి.. చివరి దాకా కొట్లాడుదామా.. ఎక్కడ అడిగినా.. ఏ జిల్లాలో అడిగినా.. ఇదే చైతన్యం కనిపిస్తా ఉంది. నేను మిమ్మల్ని అడిగేది ఇదే. ఈ దేశంలో మంచిని కాపాడటానికి.. మంచిని పెంచడానికి అవసరమైతే నా ప్రాణాన్ని కూడా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నా. అదే పద్ధతిలో ముందుకు వెళ్లాలి.
బుద్ధి తక్కువ పార్టీలు, వెదవలు.. వాళ్ల చిల్లర రాజకీయాల కోసం దేశాన్నే, భారత జాతినే బలి పెట్టేటువంటి విష ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైతన్యవంతమైన తెలంగాణ మేధావులు.. దయచేసి దాన్ని తిప్పి కొట్టాలి. భయంకరమైనటువంటి ఆ వ్యాధి ఆ క్యాన్సర్ మనకు రాకుండా చూసుకోవాలి.. అని సీఎం స్పష్టం చేశారు.
అంతకుముందు వనపర్తి జిల్లా వేదికగా మన ఊరు – మన బడి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. మన ఊరు – మన బడి పైలాన్ను సీఎం కేసీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కలిసి ఆవిష్కరించారు. ఆ తర్వాత వనపర్తి జిల్లా కలెక్టరేట్ను సీఎం ప్రారంభించారు. వనపర్తిలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.