మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి.. మా గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలి. ఆంధ్రప్రదేశ్లో మేము పలచబడ్డాం ఆనాడు. ఇప్పుడు 10 శాతం కావాలి అని అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లు పంపితే దాన్ని నరేంద్ర మోదీ కింద పెట్టుకొని కూర్చున్నాడు అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. వాల్మీకీ బోయలు.. ఎన్నో రోజుల నుంచి కొట్లాడుతున్నారు. వేరే రాష్ట్రాల్లో వాళ్లను గిరిజనులలో పెట్టారు. ఎస్టీలలో పెట్టారు. మమ్మల్ని కూడా పెట్టాలని కేంద్రానికి పంపితే.. దాన్ని కూడా కేంద్రం బేఖాతరు చేస్తోంది. అంటే.. కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ప్రజలు డిమాండ్లు తెలియవు. ప్రజల ఆవేశం తెలియదు. ప్రజల అవగాహన తెలియదు. మూర్ఖమైనటువంటి మొండి పద్ధతిలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఈ పనికిమాలిన మతపిచ్చిగాళ్లను కూకటి వేళ్లతో పెకిలించి.. బంగాళాఖాతంలో విసిరేయాలని నేను మనవి చేస్తున్నా. అప్పుడు కానీ మన సమస్యలు పరిష్కారం కావు. మన వాల్మీకీ బోయలకు గిరిజన పద్ధతిలో రావాలన్నా.. మన గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు రావాలన్నా.. మనం ముందుకు పోవాలన్నా.. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న కాషాయ జెండాలను.. భారతీయ జనతా పార్టీని బంగాళాఖాతంలో విసిరేయాలని మనవి చేస్తున్నా. దాని కోసం మనం సంసిద్ధంగా ఉండాలి. పోరాటం చేయాలి. ఎక్కడివాళ్లు అక్కడే నిలదీయాలి. న్యాయం కోసం పురోగమించాలి. దుర్మార్గమైన పద్ధతిలో ఈ దేశాన్ని నాశనం చేసే వాళ్లకు.. ప్రజలకు మత పిచ్చి లేపి దేశాన్ని సర్వనాశనం చేసేవాళ్లకు బుద్ధి చెప్పడానికి తెలంగాణ సిద్ధంగా ఉండాలి. దేశ రాజకీయాలను కూడా చైతన్య పరుస్తా. మడమ వెనక్కి తిప్పకుండా ముందుకు సాగి.. బంగారు తెలంగాణ లాంటి బంగారు భారతదేశాన్ని కూడా తయారు చేయడానికి పురోగమిద్దామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
అంతకుముందు వనపర్తి జిల్లా వేదికగా మన ఊరు – మన బడి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. మన ఊరు – మన బడి పైలాన్ను సీఎం కేసీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కలిసి ఆవిష్కరించారు. ఆ తర్వాత వనపర్తి జిల్లా కలెక్టరేట్ను సీఎం ప్రారంభించారు. వనపర్తిలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.