Illegal Sand Mining | మాగనూరు ఏప్రిల్ 04: నారాయణపేట జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసులు కూడా అక్రమార్కులకే అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. మాగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్వాట్ శివారులో రాత్రి వేళలో 10 ఇసుక టిప్పర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించినా.. మధ్యలోనే వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
వడ్వాట్ గ్రామస్తుల వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి అడవి సత్యారం పెద్దవాగు నుంచి హిటాచీల సాయంతో ఇసుకను లోడ్ చేసి 10 టిప్పర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. ఇది గమనించిన స్థానికులు డయల్ 100కు కాల్ చేసి సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు టిప్పర్లను అప్పగించి అక్కడి నుంచి గ్రామస్తులు వెళ్లిపోయారు.
అయితే టిప్పర్లను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన మాగనూరు పోలీసులు వాటిని మధ్యలోనే వదిలేశారు. దీంతో యథేచ్ఛగా రాత్రంతా అక్రమార్కులు ఇసుక అక్రమ రవాణాను జోరుగా కొనసాగించారని వడ్వాట్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు పోలీసులు పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నారని విమర్శించారు. ఏవైనా అక్రమాలు జరిగినప్పుడు సమాచారం ఇచ్చి వారిని వివరాలు గోప్యంగా ఉంచాల్సిన పోలీసులు.. సంబంధిత వ్యక్తులకు తెలియజేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంపై మాగనూరు ఎస్సై అశోక్బాబును నమస్తే తెలంగాణ రిపోర్టర్ ఫోన్ ద్వారా సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. దీనిపై నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ను వివరణ కోరగా.. పూర్తి వివరాలు తెలుసుకుంటానని తెలిపారు.