Illegal Sand Mining | మాగనూరు ఫిబ్రవరి 3: నారాయణపేట జిల్లా కృష్ణా మండల పరిధిలోని కృష్ణా నదిలో రాత్రి వేళలో అక్రమంగా ఇసుక రవాణా జోరందుకుంది. కృష్ణా మండల పరిధిలోని ముడుమాల్, వాసునగర్, ఓంకార మఠం, గురుజాల్, సమీప దూరంలోని ఉన్న కృష్ణానదిలో దర్జాగా రోడ్లు వేసుకొని ఐదు రీచ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఒక్క రీచ్ కు పది చొప్పున 12,16 టైర్ల ట్రిప్పర్లకు ఇసుక నింపి కర్ణాటక రాష్ట్రానికి 20, వేల నుంచి 30 వేల రూపాయలకు అక్రమంగా ఇసుకలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ మధ్యకాలంలో కృష్ణానదిలో నీళ్లు ఎండిపోవడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. కృష్ణానదిలో నాలుగు ఐదు రీచ్లు ఏర్పాటు చేసుకొని రాత్రి వేళలో అక్రమంగా ట్రిప్పర్లలో ఇసుక తరలిస్తున్నారు. ముడుమాల్, వాసు నగర్ గురుజాల్, సమీపంలో ఇసుక తరలిస్తున్న సమయంలో ఆయా గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పజెప్పినా పట్టించుకోవడం లేదు. పోలీసులకు అప్పజెప్పినా ఇసుక మాఫియా మాత్రం యథావిధిగా ఇసుక రవాణా కొనసాగిస్తుంది. ఈ ఇసుక అక్రమ రవాణాపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కూడా దాదాపు 200 టిప్పర్ల ఇసుకను సీజ్ చేయించారు. అయినప్పటికీ ఇసుక తరలింపు ఆగకపోవడంతో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కూడా నిర్వహించారు. అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. అయినా కూడా అడ్డుఅదుపు లేకుండా ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. సోమవారం రాత్రి కూడా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం అందించినప్పటికీ పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోకుండా ఉన్నారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బందిపై ఆయా గ్రామస్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా మండల పరిధిలో కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణాపై టాస్క్ ఫోర్స్ ఎస్సై, సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో గుడెబల్లూర్ ఓంకార మఠం సమీపంలో కొనసాగుతున్న ఇసుక రవాణాను అడ్డుకొని కేవలం 7 ఖాళీ టిప్పర్లు, 5 ట్రాక్టర్లను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. అయితే కృష్ణా మండల పరిధిలోని గురుజాల్, ముడుమాల్, వాసునగర్,లో కూడా ఇసుక రవాణా కొనసాగుతుండగా కేవలం ఓంకార మఠం సమీపంలో నడుస్తున్న అక్రమ ఇసుకను మాత్రమే అడ్డుకున్నారు. కృష్ణా మండలంలో మరో నాలుగు చోట్ల ఇసుక నడుస్తున్న విషయం టాస్క్ఫోర్స్ ఎస్సైకి తెలిసినా పట్టించుకోకుండా పోవడం గమనార్హం.
సోమవారం రాత్రి టాస్క్ఫోర్స్ సిబ్బందికి పట్టుబడ్డప్పటికీ ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగలేదు. టాస్క్ఫోర్స్ సిబ్బంది వెళ్లిపోయిన వెంటనే నదిలోకి టిప్పర్లను దించి ఇసుక తరలింపు కొనసాగించారు. ఈ అక్రమ రవాణాలో బడా నాయకుల హస్తాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అందుకే అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తహశీల్దార్ శ్రీనివాసులును వివరణ కోరగా.. రీచ్ల సమీపంలో జీపీవో, వీఆర్ఏలను ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే అధికార పార్టీ నాయకుల అండతోనే అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే.. అడ్డుపడిన వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. జీపీవోలు ఉండగా అక్రమ ఇసుక రవాణా ఎలా కొనసాగుతున్నదని కృష్ణా మండల ఎస్సైకి ఫోన్ ద్వారా నమస్తే తెలంగాణ సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. దీనిపై మక్తల్ సీఐ రామ్లాల్ను వివరణ అడగా..తనకు విషయం తెలియదని చెప్పారు. మరోసారి ఫోన్లో సీఐని సంప్రదించగా.. ఆయన కూడా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.