ఎల్బీనగర్, ఆగస్టు 6 : తప్పుడు ప్రకటనలు చేసి విద్యార్థులను మోసం చేస్తున్న ఐఏసీఈ కోచింగ్ సెంటర్పై చర్యలు తీసుకోవాలని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఉదయం చైతన్యపురిలోని ఐఏసీఈ కోచింగ్ సెంటర్ వద్ద ఆందోళన నిర్వహించిన విద్యార్థి సంఘాల నాయకులు అనంతరం సరూర్నగర్ పోలీసులకు కోచింగ్ సెంటర్పై ఫిర్యాదు చేశారు. ఐఏసీఈ కోచింగ్ సెంటర్లో సీబీటీ-2 ప్రీ పరీక్ష పేరుతో విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకుని తమ కోచింగ్ సెంటర్ నుంచి ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్, ఎన్టీపీసీ సీబీటీ-1కి అర్హత సాధించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్, డీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శేషు, పీడీఎస్యూ వెంకటేశ్, టీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్, టీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఎం శ్రీకాంత్, జనసేన విద్యార్థి నాయకులు బండి నరేశ్, మాదిగ దండోర అధ్యక్షుడు నకిరేకంటి సైదులు, బీసీ విద్యార్తి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య, బీసీ విద్యార్థి జేఏసీ నాయకుడు మామిడాల రవికుమార్, మాదిగ యూత్ జాక్ అధ్యక్షుడు మీసాల మహేశ్, బీఆర్ఎస్వీ నాయకులు ప్రవీణ్, నక్క సుధీర్, విద్యార్థి నాయకులు చిరంజీవి, వెంబడి గణేశ్, సిద్దు యాదవ్, నరేశ్, రవి తదితరులు ఐఏసీఈ కోచింగ్ సెంటర్ ప్రాంగణంలో ఆందోళన నిర్వహించిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐఏఏసీఈ కోచింగ్ సెంటర్ వారు తప్పుడు ప్రకటనలు ఇచ్చి, తప్పుడు ఫలితాలను చూపి విద్యార్థులను మోసం చేసి అక్రమంగా వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోని వారిని కూడా తమ విద్యార్థులుగా వ్యాపార ప్రకటనలు చేస్తూ కోచింగ్కు వచ్చే విద్యార్థులను మోసం చేస్తున్నారన్నారు. ఉత్తర భారత దేశానికి చెందిన విద్యార్థులు, తెలుగు రాష్ర్టాలకు చెందిన కొందరు విద్యార్థులను తమ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందకున్నా తమ విద్యార్థులుగానే పేర్కొంటూ ప్రకటనలు చేయడం మోసపూరిత చర్యలుగా వారు అభివర్ణించారు.
కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం విద్యార్థుల నుంచి కన్ఫార్మ్ లెటర్ లేకుండా వారి పేర్లు ప్రకటనల్లో పేర్కొనడం అమాయకమైన విద్యార్థులను మోసం చేయడమేనన్నారు. కోచింగ్ సెంటర్ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ అక్రమాలపై త్వరలోనే డీఈఓకు, వినియోగదారుల రక్షణ కమిషన్కు , మున్సిపల్ ఉప కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు.