నారాయణపేట : తెలంగాణలో అడవి జంతువుల వరుస మృతి తీవ్ర కలకలం రేపుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో రెండు పులులు మృత్యువాత పడ్డ ఘటనను మరచిపోకముందే నారాయణపేట జిల్లాలో మరో చిరుత (Leopard) మృతి చెందింది. జిల్లాలోని దామరగిద్ద మండలం కంసన్ పల్లి, వత్తు గుండ్ల గ్రామాల మధ్య పొలాల్లో సంచరించిన రెండు చిరుతపులులను చూసిన స్థానికులు అటవీ (Forest) శాఖ అధికారులకు సమాచారం అందించారు.
అనారోగ్యంతో ఉన్న ఒక చిరుత పంట పొలాల్లో పడిపోగా మరో చిరుత సమీప అటవి ప్రాంతంలోకి పారిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు చిరుత ఉన్న ప్రదేశానికి చేరుకునే లోగా చిరుత మృతి చెందింది. చిరుత మృతి గల కారణాలను సమీప గ్రామస్థుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. మృతి చెందిన చిరుతకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు నివేదిక వచ్చిన తరువాత పూర్తిస్థాయిలో విచారణ చేపడుతామని వెల్లడించారు.