Telangana | కల్వకుర్తి రూరల్, : హరిత తెలంగాణ సాధనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి ముందుకుసాగుతున్నది. గ్రామాలు, పట్టణాల్లో కృత్రిమ అడవులను పెంచుతున్నది. ఈ క్రమంలో భాగంగా ఎంపిక చేసిన గ్రామాల్లో పది, ఐదు ఎకరాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలతోపాటు ప్రతి గ్రామంలో ఒక ఎకరా స్థలంలో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. పల్లె ప్రకృతి వనాల్లో నాలుగు వేల మొక్కలను ఒక పద్ధతిలో నాటి వాటిని సంరక్షించే విధంగా కార్యాచరణ రూపొందించి అమలు చేసింది. పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరగడంతో అవికాస్త చిట్టడవులను తలపిస్తున్నాయి. మొక్కలకు నిత్యం నీటిని అందించడం వాటిని జాగ్రత్తగా సంరక్షించడంతో ఏపుగా పెరిగి గ్రామాల్లో అడవులుగా అవతరిస్తున్నాయి. పల్లె ప్రకృతి వనాల్లో పూలు, పండ్ల మొక్కలు, షో నిచ్చే మొక్కలతోపాటుగా కొన్ని చోట్ల ఆయుర్వేద మొక్కలను నాటి వాటి పరిరక్షణకు పాటుపడుతున్నారు. ప్రకృతి వనాలతో భవిష్యత్ తరాలకు తలమానికంగా మారడంతోపాటుగా ప్రజలకు అందం, ఆరో గ్యం, ఆహ్లాదాన్ని పంచే విధంగా మారనున్నాయి. గ్రామాల్లోని నర్సరీలు, ప్రకృతి వనాలను మం డలాధికారులు పర్యవేక్షిస్తుండడం, ప్రజలకు అవగాహన కల్పించడంతో మొక్కలు కాస్త చెట్లుగా ఎదిగా చిట్టడవిని తలపిస్తున్నాయి.
పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలకు కొత్తం అందం చేకూరుతున్నది. గతంలో పార్కులు చూడాలంటే పట్టణాలు, నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు అన్న చందంగా ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు శ్రీకారం పలికారు. పల్లె ప్రకృతి వనంలో నాలుగు వేలకు పైగా రకరకాల మొక్కలను నాటి వాటికి నిత్యం నీటిని అందిస్తూ సంరక్షిస్తున్నారు. ప్రకృతి వనాల్లో మొక్కలతోపాటుగా ప్రత్యేకంగా ఆయుర్వేద మొక్కలను నాటి వాటిని కూడా జాగ్రత్తగా కాపాడుతున్నారు. ప్రకృతి వనంలో చుట్టూ తిరగడానికి ప్రత్యేకంగా ఫుట్ ట్రాక్ను ఏర్పాటు చేసి గ్రామస్తులు ఆ ట్రాక్లో నడిచే విధంగా రూపొందించారు. ప్రకృతి వనంలోకి అడుగిడిన ప్రతిఒక్కరికి అక్కడి వాతావరణం పచ్చదనం ఎంతగానో ఆకర్షిస్తుంది. దీనికి తోడుగా గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామానికి చెందిన దాతల సహకారంతో సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేయించి అటు వైపుగా వెళ్లేవారు సరదాగా కాసేపు వనంలో కాలక్షేపం చేస్తున్నారు.
ప్రభుత్వం గ్రామగ్రామాన ఏర్పాటు చేసిన ప్రకృతి వనంలో వేప, టేకు, వెదురు, కాంచన, సుబాబుల్, చింత, జామ, సీతాఫలం, షో చెట్లను వరస క్రమంలో చక్కగా నాటారు. తాండ్ర గ్రామంలో ప్రకృతి వనంలో ఔషధ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. నాటిన మొక్కలకు బయో ఫెన్సింగ్ నిర్వహించి నీటిని అందిస్తుండడంతో చెట్లుగా ఎదిగాయి. మండలంలోని పలు గ్రామాల్లో వనం మధ్యలో ప్రత్యేక ఆకర్షణగా మొక్కలను ఏర్నాటు చేయడంతో మరింత శోభ చేకూరుతున్నది. రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతో మొక్కలు చక్కగా ఎదిగి హరిత రహదారులుగా మారిపోతున్నాయి. పల్లె ప్రకృతి వనాలను గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యవేక్షిస్తుండడంతో వనాలు మరింత అందంగా ఆహ్లాదంగా హరిత గ్రామాలుగా కనిపిస్తున్నాయి. ప్రకృతి వనాలను సందర్శించిన ప్రతిఒక్కరూ ఆనందంగా మొక్కలను వీక్షిస్తున్నారు.