అచ్చంపేటరూరల్: 50 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా నెలకు 5 వేలు రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం అచ్చంపేట టీఎన్జీవో భవన్లో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం (AITUC) సమావేశంలో అయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డు ఈరోజు సమస్యల నిలయంగా మారిందని ఆరోపించారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఏఐటీయూసీ నిరంతరం అండగా నిలిచి పోరాడుతుందని అన్నారు.
గత కొన్ని నెలలుగా కార్మికులకు బోర్డు నుండి డబ్బులు ఇవ్వడం లేదని ఆన్లైన్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పరిష్కరించడంలో లేబర్ డిపార్ట్మెంట్ వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఆన్లైన్ అప్డేట్ పేరుతో కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు కార్మికులు రోజుల తరబడి లేబర్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంక్షేమ బోర్డులో జమ కావాల్సిన సెస్సు సక్రమంగా వసూలు చేయకపోవడం వల్ల కార్మిక సంక్షేమ నిధులు పెరగడం లేదని అన్నారు. సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిథ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
మెడికల్ చెకప్ ల పేరుతో జరుగుతున్న ఆర్థిక దోపిడీపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాల వలన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సంక్షేమ బోర్డును ఎత్తి వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని దాని రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మికులపై ఉందని అన్నారు. కార్మిక వ్యతిరేక విధాలు తిప్పికొట్టేందుకు పోరాటాలు తీవ్రతరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
నిజమైన కార్మికులు లబ్ధి పొందే విధంగా లేబర్ డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకోవాలని అన్నారు. బోగస్ కార్డుల పై సమగ్ర విచారణ జరిపించి వాటిని తొలగించాలని లేబర్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు జిల్లా నాయకులు పెర్ముల గోపాల్, ఎస్ మల్లేష్, ఆర్ కృష్ణ, కే చంద్రం, శివరాజు, లచ్చలయ్య, ఎం రాములు, డి తిరుపతయ్య, సైదమ్మ, రుక్కి, శాంతమ్మ, దేవేందర్, జగన్, సైదులు, కృష్ణ, సునీత తదితరులు పాల్గొన్నారు.