నాగర్ కర్నూల్ : జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతున్నది. వెల్దండ మండలం నారాయణపూర్ గ్రామంలో గురువారం తెల్లవారుజామున లేగ దూడ పై ఓ చిరుత పులి దాడి చేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జక్కుల జంగయ్య అనే రైతు గ్రామ సమీపంలో ఉన్న తన వ్యవసాయ పొలంలో ఆవు దూడను కట్టేసి ఉంచారు.
గురువారం ఉదయం రైతు తన పొలం వద్దకు వెళ్లగా ఆవు దూడ పై గుర్తు తెలియని జంతువు దాడి చేసి చంపి తిన్నది. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ అంజి నాయక్కు తెలుపగా ఆయన ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫారెస్ట్ అధికారి లలిత సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ జంతువు తిరిగిన చోటును పరిశీలించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చిరుతను గుర్తించేందుకు చర్యలు చేపడతామని అన్నారు.