మహబూబ్ నగర్ : పరిపాలన సౌలభ్యం కోసమే ప్రభుత్వం నూతన జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇటీవల నూతన మండల కేంద్రంగా ఏర్పాటైన మహమ్మదాబాద్లో మండల కార్యాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఐదు జిల్లాలుగా విడిపోయింది. అనేక నూతన మండలాలు ఏర్పాటయ్యాయి. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుతో పరిపాలన మరింత సులభతరం కానుందని తెలిపారు. పరిగి నియోజకవర్గంలోని గండీడ్ మండలంలోని పలు గ్రామాలను కలిపి మహమ్మదాబాద్ మండలాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
మహమ్మదాబాద్ ఇకపై ప్రత్యేక మండలంగా ఉంటుందని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్ రావు, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి, మహమ్మదాబాద్ మండల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.