జగిత్యాల రూరల్, ఏప్రిల్ 25: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ కౌలు రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా రూరల్ మండలం తిప్పన్నపేటలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తిప్పన్నపేటకు చెందిన కౌలు రైతు నలువాల నర్సయ్య (57) ఎకరంన్నర భూమిని కౌలుకు తీసుకొని కొద్దిరోజులుగా సాగు చేస్తున్నాడు. గురువారం ఉదయం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. అప్పటికే పొలం వద్ద తెగిపడి ఉన్న ఎల్టీ విద్యుత్తు వైరు తగలడంతో షాక్ కొట్టి మృతి చెందాడు. తమ పొలం వద్ద విద్యుత్తు వైర్లు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయని చెబుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని నర్సయ్య కొడుకు రమేశ్ ఆరోపించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. నర్సయ్యకు భార్య, కొడుకు ఉన్నారు. కొడుకు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు జగిత్యాల రూరల్ ఎస్సై సధాకర్ తెలిపారు. విద్యుత్తు ఏడీ జవహర్లాల్ నాయక్, ఏఈ సురేందర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.