నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ) : ఇప్పటికే లోక్సభ ఎన్నికల హడావుడి కొనసాగుతుండగా నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికకు నగారా మోగింది. ఇక్కడ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2027 మార్చినాటికి మిగిలి ఉన్న కాలానికి ఎన్నిక నిర్వహించనున్నారు. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక కోసం షెడ్యూల్ను విడుదల చేసింది. వచ్చే నెల రెండో తేదీన నోటిఫికేషన్ వెలువరించి అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 9వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 10న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 13వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు విధించారు.
ఈ నెల 7 తేదీన ఓటర్ల తుది జాబితాను వెల్లడించారు. మొత్తం 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. వీరిలో మహిళా ఓటర్లు 1,74,794 మంది, పురుషులు 2,87,007 మంది, ట్రాన్స్జెండర్లు ఐదుగురు ఉన్నారు. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల ఓటర్లతో పోలిస్తే ఈ సారి సుమారు 45 వేల మంది ఓటర్లు తగ్గారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం మొత్తం 12 జిల్లాలతో కూడి ఉన్నది. పై మూడు ఉమ్మడి జిల్లాలతోపాటు సిద్దిపేట జిల్లాలోని నాలుగు మండలాలు కూడా ఇందులో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల ప్రకారం పట్టభద్రుల ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే… నల్లగొండ జిల్లాలో 1,65,778 మంది, ఖమ్మం జిల్లాలో 1,23,504 మంది, వరంగల్ జిల్లాలో 1,67,853 మంది, సిద్దిపేట జిల్లాలో 4,671 మంది ఉన్నారు.
పట్టభద్రుల నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 2007, 2009, 2015, 2021లలో మొత్తం నాలుగు సార్లు ఎన్నిక జరుగగా అన్నిసార్లు బీఆర్ఎస్ పార్టీనే విజయం సాధించింది. 2021 మార్చిలో జరిగిన ఎన్నికలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో తలమునకలై ఉన్న రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికలపై దృష్టి సారించక తప్పేలా లేదు. రెండు ఎన్నికలతో మరింత సందడి నెలకొననుంది.