ఈ తెలంగాణ మీది, భవిష్యత్తు మీది, ఈ రాష్ర్టాన్ని ముందుకు నడిపేది మీరు. ఈ ఎన్నికల్లో ఏం జరుగుతున్నది? ఎవరికి ఓటేస్తే ఈ రాష్ర్టానికి మేలు జరుగుతది? అని ఆలోచించి, బుద్ధితో ఓటేయాలి. పిచ్చిలో, ఉన్మాదంలో కాకుండా, ఆలోచనతో, ప్రజాస్వామ్య పరిణతితో ఓటేస్తే మనకు, మన రాష్ర్టానికి, ప్రజాస్వామ్యానికి మంచి జరుగుతది.
-కేసీఆర్
‘మీ వడ్లకు 500 బోనస్ అందిందా?’ కేసీఆర్ ప్రశ్న
‘లేదు.. లేదు.. లేదు’ ఎలుగెత్తి నినదించిన ప్రజలు.
‘మీకు 15 వేల రైతు భరోసా అందిందా?’ కేసీఆర్ ప్రశ్న.
‘లేదు.. లేదు.. లేదు’ చేతులెత్తి జవాబిచ్చిన జనం.
‘నేనిచ్చిన 10 వేల రైతుబంధు అయినా ఈ సారి మీకు పడిందా?’ కేసీఆర్ ప్రశ్న.
‘పడలేదు.. పడలేదు..’ ఉద్రేకంతో దద్దరిల్లేలా అరిచిన ప్రజలు.
‘మరి ఈ రైతుబంధు ఉంటదో.. ఊడుతదో? మీ కోసం.. ఎవరు కొట్లాడాలె?’ కేసీఆర్ ప్రశ్న.
‘కేసీఆర్.. కేసీఆర్.. కేసీఆర్..’ దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వని.
ప్రజల తరఫున కొట్లాడే పంజు ఎవరు?.. కేసీఆర్ ప్రశ్న
‘కేసీఆర్.. కేసీఆర్..’ జనం ఉత్సాహం
‘అందరం కలిసి యుద్ధం చేద్దాం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలె.’ కేసీఆర్ ఉద్బోధ.
ఐదు ఎకరాలకే ఇస్తమంటే.. ఆరేడు ఎకరాలున్నోడు ఎటు పోవాలె? మీ అబ్బ జాగీరు పోతున్నదా?. మీ ముల్లె ఏమన్న పోతున్నదా? రైతులకు బెంజ్ కార్లు ఉన్నయా? కోట్ల ఆస్తులు ఉన్నయా?
దేవుడు నన్ను తెలంగాణ కోసమే పుట్టించిండు. ఇయ్యాల రైతుల గుండెల్లో, తెలంగాణ ప్రజల హృదయాల్లో కనిపించేది కేసీఆర్. కేసీఆర్ గుండె చీల్చితే కనిపించేది తెలంగాణ. నా ప్రాణం ఉన్నంతవరకు, భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంతవరకు తెలంగాణలో ఎవరికి అన్యాయం జరిగినా నిద్రపోను. భూమి, ఆకాశం ఒక్కటి చేసి, పిడుగులు పడ్డంత పోరాటం చేస్తా
మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తున్నరా? కల్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం ఇస్తున్నరా? నిరుద్యోగులకు రూ.4వేల భృతి ఇస్తున్నరా? జాబ్ క్యాలెండర్ ప్రకటించారా? మెగా డీఎస్సీ ప్రకటన వచ్చిందా?
మోదీ హయాంలో రూపాయి విలువ పడిపోయింది, మహిళలకు రక్షణ లేదు, దేశంలో పేదరికం పెరిగిపోయింది, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా అక్షింతలు కలపాలె.. తీర్థం పుచ్చుకోవాలె, పులిహోర ప్రసాదం తినాలె, ఊరేగింపులు తియ్యాలె. అక్షింతలు, పులిహోర, తీర్థాలు, కాషాయ జెండాల ఊరేగింపులు మన కడుపు నింపుతయా? మన పొలాలకు నీళ్లు తెస్తయా?
KCR | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రైతుభరోసా పేరిట ఎకరాకు రూ.15 వేలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. తీరా తాము ఇచ్చిన రూ.పది వేలు కూడా ఇవ్వడం లేదని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు మండి పడ్డారు. రైతుబంధు ఉంటదో.. ఊడతదో.. అని ఆందోళన వ్యక్తంచేశారు. మిల్లర్ల కాడ కమీషన్లు తీసుకొని, ధాన్యం కొనుగోళ్లను గోల్మాల్ చేశారని ఫైరయ్యారు. బోనస్ ధర బోగస్గా మారిందని, కల్యాణలక్ష్మితోపాటు ఇస్తామన్న తులం బంగారం తుస్సుమన్నదని ఎద్దేవా చేశారు. బస్సుయాత్రలో భాగంగా కేసీఆర్ గురువారం భువనగిరిలో నిర్వహించిన రోడ్షోలో మాట్లాడారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి కాంగ్రెస్ ముంచితే, గత పదేండ్లలో బీజేపీ భారీగా నష్టం చేసిందని మండిపడ్డారు. పదేండ్లలో తెలంగాణకు ఏమీ ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింద ని విమర్శించారు. కాంగ్రెస్ దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కి, ఇప్పుడు అమలు చేయకుండా తిప్పలు పెడుతున్నదని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలూ తెలంగాణకు ద్రోహం చేశాయని, దేవుడిని అడ్డం పెట్టుకొని ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ, కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. తనను భగవంతుడు తెలంగాణ కోసమే పుట్టించాడని, తన ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణలో ఎవరికి అన్యాయం జరిగినా కొట్లాడుతానని స్పష్టం చేశారు.
బీజేపీ పదేండ్ల పాలనలో దేశంలో ఏ ఒక్క వర్గానికీ న్యాయం జరగలేదని కేసీఆర్ విమర్శించారు. మేకిన్ ఇండియా, సబ్ కా సాథ్-సబ్కా వికాస్ అంటూ నినాదాలు ఇచ్చారని, వాటివల్ల ఎవరికైనా, ఏమైనా లాభం జరిగిందా? అని ప్రశ్నించారు. దేశంలో 18 లక్షల ఉద్యోగ ఖాళీ లు ఉన్నాయని, మోదీ ప్రభుత్వం వాటిని భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. ‘ఇది న్యాయ మా? అన్యాయమా?’ అని ప్రజలను ప్రశ్నించగా.. ‘అన్యాయం’ అంటూ సమాధానం వ చ్చింది. ‘బేటీ పఢావో.. బేటీ బచావో అన్నరు. కానీ, ఏ బేటీకైనా పఢాయించిండా? ఏ బేటీనైనా బచాయించిండా? బీజేపీ రాష్ర్టాల్లో మహిళలపై దాడులు జరుగుతున్నా యి.’ అని ఆవేదన వ్యక్తంచేశారు. మోదీ పాలనలో రూపాయి విలువ డాలర్తో పోల్చితే రూ.83కు దిగజారిందని విమర్శించారు. ‘అంతర్జాతీయంగా ఇదీ భారత్ గౌరవం. బీజేపీ పరిపాలన ఫలితం’ అని దుయ్యబట్టారు.
తెలంగాణ భారీగా నష్టపోయిందే బీజేపీ వల్ల అని కేసీఆర్ స్పష్టంచేశారు. ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే తెల్లారి నుంచే మీటర్లు పెట్టాలంటారని హెచ్చరించారు. కాబట్టి రైతులు ఆలోచించి ఓటేయాలని కోరారు. గతంలో పోరాడి ఎయిమ్స్ ను భువనగిరి తెచ్చుకున్నామని గుర్తు చేశారు. తాను ఎన్ని లేఖలు రాసినా, ఢిల్లీకి వెళ్లి వినతిపత్రాలు ఇచ్చినా బీజేపీ హయాంలో తెలంగాణకు ఒక్క నవోదయ విద్యాసంస్థగానీ, మెడికల్ కాలేజీ గానీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఇప్పు డు బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి, అప్పుడు ఎంపీగా ఉన్నాడని, ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడని నిలదీశారు. గత ఎన్నికల్లో తప్పిపోయి ఓటేస్తే నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారని, అందులో ఒకరు కేంద్ర మంత్రి అయ్యారని చెప్పారు. అయినా వాళ్లు ఒక్క రూపాయి అయినా తెచ్చారా? ఐదు రూపాయల పనైనా చేశారా? అని ప్రశ్నించారు. ‘ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తరు. పుసుపు కలుపుడు, బియ్యం కలుపుడు, అక్షింతలు కలుపు డు, ఊరూరుకు పంచుడు, పులిహోర వండు డు, పదిమందికి పెట్టుడు, ఓట్లు దొబ్బుడు’ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో యువత ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
1956 నుంచి ఇప్పటిదాకా తెలంగాణకు శత్రువే కాంగ్రెస్ పార్టీ, 58 ఏండ్లు గోసపడ్డామని అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘ఈ తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో సమైక్యవాదుల నుంచి విముక్తి కావాలె అని భగవంతుడు నన్ను తెలంగాణ కోసమే పుట్టించిండు. ఆనాడు ఎవరు లేకు న్నా.. ఎవ్వరు ధైర్యం చేయకపోయినా, కచ్చితంగా ఈ తెలంగాణకు విముక్తి కావాలె, సొంత రాష్ట్రంగా ఉండాలె అని నేను ఒక్కడినే, జగదీశ్రెడ్డి వంటి పదిమంది మిత్రులతో కలిసి, ప్రజలను నమ్ముకొని ఉద్యమం మొదలుపెట్టిన. 15 ఏండ్లు నిరాటంకంగా పోరాడితే నాడు కేంద్రం తలవంచి తెలంగాణ ఇచ్చింది’ అని వివరించారు. ‘నేను తెచ్చుకున్న రాష్ట్రంలో.. ఒక తల్లి కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టు నా ప్రజలను.. ఈ వర్గం, ఆ వర్గం అని లేకుండా అందరినీ ఆదరించుకున్నం. అందరినీ కాపాడినం’ అని వివరించారు.
తెలంగాణలో 2104కు ముందు రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారని, వలసలు పోయేవారని, భగవంతుడి దయవల్ల అవన్నీ బంద్ చేశామని కేసీఆర్ అన్నారు. తెలంగాణ మంచిగైందని సంతోషపడ్డామని, కానీ ఇప్పుడు కాం గ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాత్రి కరంటు పెట్టబోయి చనిపోయినవాళ్లు, పొలం ఎండిపోతే గుండె ఆగిపోయినోళ్లు 225 మంది దాకా ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వాళ్లను పరామర్శించి, కుటుంబాలను ఆదుకోవాలని సీఎంను కోరితే పట్టించుకోలేదని మండిపడ్డారు. గతంలో రైతుబీమా ప్రవేశపెట్టామని, రైతు మరణిస్తే రూ.5 లక్షలు వారంలోనే వాళ్ల ఇంటికి డబ్బులు వచ్చేవని చెప్పారు. కానీ ఇప్పుడు సీఎంగానీ, మంత్రులుగానీ, ఎమ్మెల్యేలు గానీ పరామర్శించిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. ‘రైతులంటే మీకు కనవడుతలేరా? అంత అగ్గువ అయిపోయిర్రా? అధ్వా నం అయిపోయిర్రా?’ అని మండిపడ్డారు. రైతుల వివరాలను 48 గంటల్లో పంపితే ఆదుకుంటా అని సీఎం చెప్తే.. తాను నాలుగు గంట్లలోనే ఫొటోలు, ఫోన్ నంబర్లతో సహా పంపానని కేసీఆర్ గుర్తు చేశారు. అయినా ఇప్పటివరకు ఎవ్వరూ పరామర్శించలేదని చెప్పారు. ‘రైతులకు ఏం బాధ ఇది, నా రైతులకు ఎందుకు రావాలె, నేను మంచిగ చేసుకున్న తెలంగాణ, మంచిగ పంటలు పండిన తెలంగాణ ఎందుకు నాశనం కావాలె’ ఆని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ను వైఎస్ హయాంలో ప్రారంభిస్తే, కాంగ్రెస్ చేసిందంటూ తాము ఆపలేదని, అందరికీ ఇచ్చామని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు ఒక్క ప్రైవేట్ కాలేజీకి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని మండిపడ్డారు. ఐదు నెలలుగా కాలేజీల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని చెప్పారు. ఇలాగైతే పిల్లలకు చదువు ఎట్లా చెప్తారని ప్రశ్నించారు. తా ము 1100 గురుకులాలు పెట్టామని, అందు లో చదువుకున్న పిల్లలు కలెక్టర్లు, ఇంజినీర్లు, డాక్టర్లు అయితున్నరని చెప్పారు. గురుకులాల్లో పిల్లలకు విషాహారం పెడుతున్నరని, కల్తీ అన్నం పెడుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. 135 మంది విద్యార్థులు దవాఖానల్లో పడ్డారని, నలుగురైదుగురు చనిపోయారని, భువనగిరిలోనే ఒక అమ్మాయి చనిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఇదేనా జరగాల్సిన పద్ధతి. ప్రభు త్వం ఏం చేస్తున్నది?’ అని ప్రశ్నించారు. ‘నా కండ్ల ముందటనే తెలంగాణ ఎండిపోతుంటే యుద్ధం చేయాల్నా? వద్దా? అందరం కలిసి చే ద్దామా?’ అని ప్రశ్నించగా.. ‘చే ద్దాం.. చేద్దాం.. చేద్దాం’ అంటూ సమాధానం వచ్చింది. తన కంఠంలో ప్రాణమున్నంతవరకు ప్రజలతోనే, ప్రజల కోసమే ఉంటానని చెప్పారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి, ఇప్పుడు అమలు చేయకుండా మోసం చేస్తున్నదని కేసీఆర్ మండిపడ్డారు. చేనేత కార్మికులకు సగం ధరకే రసాయనాలు ఇచ్చామని, ఆర్డర్లు ఇచ్చి వాళ్ల బతుకులు కాపాడామని గుర్తు చేశారు. ఇప్పుడు అవి కూడా బంద్ పెట్టారని విమర్శించారు. తాము రెండుసార్లు రైతులకు రూ.30 వేల కోట్లు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9 నాడు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, వరికి రూ.500 బోనస్ ఇస్తామన్నారని చెప్పి మోసం చేసిందని మండిపడ్డారు. పైగా ఇప్పుడు.. వచ్చేసారి ఇస్తామంటూ దేవుళ్లపై ఒట్లు వేస్తున్నారని మండిపడ్డారు. వాళ్ల ఒట్లు నమ్మేటట్టు ఉన్నాయా? అని ప్రశ్నించారు. అన్న వస్ర్తానికి పోతే.. ఉన్న వస్త్రం పోయిందన్నట్టుగా గృహజ్యోతి పథకం తయారైందని ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. గతంలో రూ.800 కరెంటు బిల్లు వచ్చేదని, ఇప్పుడు రూ.1,500 వస్తున్నదని మొత్తుకుంటున్నారని చెప్పారు. ఆడపిల్లలకు, యువతులకు ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తామన్నారని, ‘స్కూటీలు రాలేదు కానీ.. లూటీలు మాత్రం నడుస్తున్నయి’ అని ఎద్దేవా చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తున్నరా? కల్యాణలక్ష్మికి అదనంగా తులం బంగారం ఇస్తున్నరా? నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇస్తున్నరా? జాబ్ క్యాలండర్ ప్రకటించారా? మెగా డీఎస్సీ ప్రకటన వచ్చిందా? అని ప్రజలను ప్రశ్నించగా.. ‘రాలేదు..రాలేదు’ అనే సమాధానం వచ్చింది. ‘తులం బంగారం తుస్సుమన్నది? బోనస్ బోగస్ అయ్యింది’ అని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ హాయంలో రైతులను అన్నివిధాలా ఆదుకున్నామని కేసీఆర్ చెప్పారు.. దేశంలోనే మొదటిసారిగా రైతులకు ఏటా ఎకరానికి రూ.10 వేలు ఇచ్చే రైతుబంధును ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. బ్రహ్మాండంగా సాగునీరు అందించామని చెప్పారు. భువనగిరిలో బస్వాపూర్ ప్రాజెక్టుకు పూర్తి చేశామని, నీళ్లు వస్తాయని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ రూ.10 వేలు ఇస్తే, మేము రూ.15 వేలు ఇస్తం, కేసీఆర్ రూ.లక్ష మాఫీ చేస్తే, మేము రూ.2 లక్షలు మాఫీ చేస్తమన్నారని గుర్తు చేశారు. రైతుబంధు అందరికీ వచ్చిందా? అని ప్రశ్నించగా ‘పడలేదు.. పడలేదు’ అని పెద్ద ఎత్తున సమాధానం వచ్చింది. మూడు ఎకరాలకు ఇస్తాం, ఐదు ఎకరాలకు ఇస్తామని కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు. ‘ఐదు ఎకరాలకే ఇస్తమంటే.. ఆరేడు ఎకరాలున్నోడు ఎటు పోవాలె. మీ అబ్బ జాగీరు పోతున్నదా? మీ ముల్లె ఏమన్న పోతున్నదా? రైతులకు బెంజ్ కార్లు ఉన్నయా? కోట్ల ఆస్తులు ఉన్నయా?’ అని ధ్వజమెత్తారు. మరోవైపు, ప్రాజెక్టుల నుంచి సరిగా నీరు విడుదల చేయకుండా పంటలు ఎండబెట్టారని విమర్శించారు. వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకుపోతే కొనే దిక్కు లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధర సరిగా ఇవ్వడం లేదని విమర్శించారు. ‘మిల్లర్ల కాడ కమీషన్లు తీసుకొని, వీళ్లు కొనుగోలుకు ముందుకొస్తలేరు. కొనుగోలును గోల్మాల్ చేసినరు’ అని మండిపడ్డారు.
భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్ధి క్యామ మల్లేశ్ పట్టుదల, నిజాయితీ ఉన్న నాయకుడని కేసీఆర్ కొనియాడారు. బాగా చదువుకొన్న వ్యక్తి, 24 గంటలు ప్రజల కోసమే పనిచేసే వ్యక్తి, రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని కేసీఆర్ పేర్కొన్నారు. మంచి ఆస్తిపరుడని, ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని వివరించారు. ఇటువంటి వ్యక్తులు గెలిస్తే ప్రజలకు తలలో నాలుకలాగా ఉంటారని, ప్రజల్లో ఒకడిగా ఉంటారని చెప్పారు. బలహీనవర్గాల అభ్యైర్థెన మల్లేశ్ను మంచి మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఇదే తరహా ఉత్సాహాన్ని ఎన్నికల వరకు కొనసాగించి కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీతో మల్లేశ్ను గెలిపించాలని ప్రజలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
భగవంతుడు తెలంగాణ కోసమే తనను పుట్టించాడని కేసీఆర్ అన్నారు. ‘ఇయ్యాల రైతుల గుండెల్లో, తెలంగాణ ప్రజల హృదయాల్లో కనిపించేది కేసీఆర్. కేసీఆర్ గుండే చీల్చితే కనిపించేది తెలంగాణ. నా ప్రాణం ఉన్నంతవరకు, భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంతవరకు తెలంగాణలో ఎవరికి అన్యాయం జరిగినా నిద్రపోను. భూమి, ఆకాశం ఒక్కటి చేసి, పిడుగులు పడ్డంత పోరాటం చేస్తా’ అని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక దుర్మార్గమైన సుడిగాలి వచ్చి, బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పారు. అయినా తనకు బాధ లేదని, పార్టీ అంటే ఓడినా, గెలిచినా ప్రజల్లో ఉండాలని, ప్రజల కోసం పని చేయాలని చెప్పారు. దొంగ హామీలు ఇచ్చి, ప్రజలను బురిడీ కొట్టించి, చల్లగా ముందుకు పోతున్న రాష్ర్టాన్ని ఆగం చేసిన కాంగ్రెస్ మెడలు వంచుతామని చెప్పారు. వాళ్లు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఊర్లల్లో పంచాయితీ పడితే రెండువైపులా పంజులను పెట్టుకుంటారని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు.. వాగ్దానాలను భంగం చేసి, రైతాంగం నోట్లో మట్టికొట్టి, నిరుద్యోగ యువతను, మహిళలను మోసం చేసిన కాంగ్రెస్కు మధ్య పంచాయితీ పడ్డదని వివరించారు. ‘ప్రజల తరఫున కొట్లాడే పంజు ఎవరు?’ అని ప్రశ్నించగా.. ‘కేసీఆర్.. కేసీఆర్’ అని సమాధానం వచ్చింది. ‘మీరు నన్ను కింద పడగొట్టినా.. కేసీఆర్ కొట్లాడాల్నా?’ అని అడడగా ‘కొట్లాడాలె.. కొట్లాడాలె’ అంటూ భారీ ఎత్తున స్పందన కనిపించింది.
‘ఇప్పుడు రాష్ట్రంలో ఒక పార్టీ దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటున్నది. ఇంకోపార్టీ ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుని మీద ఒట్లు వేస్తున్నది. ఒకరేమో ఓట్లు, ఇంకొకరేమో ఒట్లు’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో అద్భుతమైన యాదాద్రి దేవాలయం నిర్మించుకున్నామని గుర్తుచేశారు. ‘ఎన్నడన్నా యాదాద్రి దేవాలయాన్ని, యాదగిరిగుట్టను ఓట్ల కోసం వాడుకున్నమా?’ అని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలకు, బీఆర్ఎస్కు ఇదే తేడా అని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ను ‘బీ టీమ్’ అంటూ బీజేపీ, కాంగ్రెస్ నాటకాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. ‘భువనగిరిలో ఏం జరిగింది? బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ అయిపోయి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ను దింపేశారు. ఇప్పుడు కాంగ్రెసోడు చైర్మన్, బీజేపీవోడు వైస్ చైర్మన్. మరి ఎవరు ఎవరికి బీ టీం?’ అని ప్రశ్నించారు.