అయిజ (జోగులాంబ గద్వాల) : కాంగ్రెస్ పార్టీ ఏనాడు తెలంగాణకు కరెంటు సరిగ్గా ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉచిత కరెంటు పేరుతో మూడు గంటలు, నాలుగు గంటలు మాత్రమే ఇచ్చేదని ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం అన్నారు. సోమవారం అయిజ మండలం టిటి దొడ్డి గ్రామంలోని రైతు వేదిక దగ్గర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు మేరకు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరెంట్ కష్టాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మళ్లీ మాట మారుస్తూ రైతులకు ఉచిత కరెంటు ఇస్తామని మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. రైతులు కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. అన్నదాతలకు సరిపడా కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ను ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పాల్గొన్నారు.