జోగులాంబ గద్వాల : గద్వాల పట్టణ ప్రజలను మోసం చేయడమే కాకుండా నియోజకవర్గ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న బీజేపీ నాయకుల్లారా ఖబడ్దార్.. ఇకపై మీ ఆటలు సాగవంటూ జిల్లా టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కౌన్సెలర్లు ధ్వజమెత్తారు. అభివృద్ధి పనులకు అడ్డుపడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గోవిందు ఆధ్వర్యంలో మాజీ మంత్రి డీకే అరుణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. స్థానిక వైఎస్సార్ చౌరస్తాలో బీజేపీ పార్టీ, డీకే అరుణ తీరుకు నిరసనగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ప్రజలను మోసం చేసే విధంగా అక్రమ పద్ధతిలో పట్టాలు ఇవ్వడమే కాకుండా అయోమయం సృష్టిస్తున్నారని బీజేపీ నాయకులపై సుభాన్ ధ్వజమెత్తారు. 40 ఏళ్లు ఈ ప్రాంతాన్ని ఒకే కుటుంబం పాలించి విద్య, ఆరోగ్యపరంగా వెనుకబాటుకు గురిచేయడమే కాకుండా వలసలకు, అక్రమ వ్యాపారాలకు అడ్డగా మార్చారని అన్నారు.
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై అక్కసుతోనే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు తిరస్కరించినా బీజేపీ నాయకులకు, మాజీ మంత్రికి బుద్ధి రాలేదని, గద్వాల ప్రజలు రాజకీయ సన్యాసం తీసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జోస్యం చెప్పారు. అదేవిధంగా వడ్లు కొనాలని టీఆర్ఎస్ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రైతులు డిమాండ్ చేస్తుంటే ఇక్కడి బీజేపీ నాయకులు మాత్రం ఢిల్లీకి వెళ్లి డిల్లీ పాలకుల కాళ్లు మొక్కుతున్నారు కానీ వడ్లు కొనాలని కోరలేదన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు మురళి, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, కృష్ణ, మహేష్, నరహరి గౌడ్, నాగరాజు, గద్వాల టౌన్ టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సాయి శ్యామ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.