కమలాపూర్, ఆగస్టు 10 : ‘డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముమ్మాటికీ మా కేసీఆర్ కట్టినవే. ప్రజలకు కూడా తెలుసు. సంక్షేమ పథకాలు అమలు చేసే దమ్ములేక అప్పుల పేరుతో తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుంది’ అని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి.. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో వాగ్వాదానికి దిగారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు, మర్రిపెల్లిగూడెం, కమలాపూర్ గ్రామాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన 402 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సోమవారం వచ్చారు.
గూడూరులో ప్రారంభించి కమలాపూర్లో లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసేందుకు అధికారులు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించిన కేసీఆర్కు ఒక్కసారి చప్పట్లు గట్టిగా కొట్టాలని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పలానా కేసీఆర్ కట్టిండని మేము ముట్టుకోమని ఎక్కడా చెప్పలేదు. ప్రజా ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం పనిచేస్తాం. అప్పుడు కట్టినా, ఇప్పుడు కట్టినా ప్రజల డబ్బుతో కట్టినవే. పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేస్తాం’ అన్నారు.
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వం రూ. 8 లక్షల 21 వేల కోట్ల అప్పులు చేసిందని, అయినా కాంగ్రెస్ సర్కార్ సంక్షేమ పథకాలు ఎక్కడా ఆపలేదని అన్నారు. రాష్ట్రంలో మహిళా సంఘాలకు రూ. 63 వేల కోట్లు సున్నా వడ్డీకే ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వం ఖజానాను కొల్లగొట్టిందని పదేపదే మంత్రి అనడంతో కౌశిక్రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. వాగ్వాదం జరుగుతున్న సమయంలో సభలో కాంగ్రెస్ నాయకులు సభావేదికవైపు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల నినాదాలు హోరెత్తడంతో రసాభాసగా మారింది. గొడవకు దారితీసే అవకాశం ఉండటంతో కేవలం ముగ్గురు లబ్ధిదారులకు మాత్రమే ఇండ్ల పత్రా లు అందజేసి మంత్రులు వెళ్లిపోయారు.