సాంకేతికత అభివృద్ధి చెందుతున్నకొద్దీ సౌకర్యాలు మెరుగుపడతాయనేది తెలిసిందే. అయితే ఆ సాంకేతికత వ్యాపార సూత్రంగా మారినప్పటి నుంచీ సమస్యలు మొదలవుతాయి. ఎందుకంటే వడ్డింపులు లేకుండా వ్యాపారం ఉండదు. వడ్డింపులు మొదట్లో నొప్పి తెలియకుండా ఉండీఉండనట్టుగానే ఉంటాయి. క్రమంగా డోసు పెరుగుతుంది. ప్రజలు క్రమంగా అలవాటు పడుతారులే అని వ్యాపార వర్గాలు భావిస్తుంటాయి.
ఈ సూత్రం తాజాగా యూపీఐ అనే ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థకూ వర్తిస్తున్నదా? అనే సందేహాలు సామాన్యుల్లో మొదలయ్యాయి. 2016లో మొదలైన యూపీఐ విధానంలో సెల్ఫోన్లు లేదా ఇతర ఆన్లైన్ పద్ధతుల్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా చెల్లింపులు చిటికెలో జరిపే సౌలభ్యం ఏర్పడింది. పాలు, కూరగాయలు మొదలుకొని పచారీ సామాను దాకా యూపీఐపై చెల్లింపులు జోరుగా సాగుతుండటం మనం చూస్తున్నాం.
టీ తాగినా, బిస్కెట్ పొట్లం కొన్నా సెల్ఫోన్ తీయడం.. స్కాన్ చేసి చెల్లింపు జరుపడం సర్వసాధారణం అయిపోయింది. ఎలాంటి చార్జీలు ఉండవనే నమ్మకం కారణంగా ఈ చెల్లింపుల వ్యవస్థ అంచెలంచెలుగా ఎదిగింది. కేవలం గత నెలలోనే 2,451 కోట్ల లావాదేవీల కింద రూ.29.82 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. నిరుడు అంటే 2025-26 లెక్కలు తీసుకుంటే రూ.24,162 కోట్ల లావాదేవీలకుగాను రూ.314 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. ఫోన్పే (45.9 శాతం), గూగుల్ పే (32.4 శాతం), పేటీఎం (8.1 శాతం) వాటాతో మొదటి మూడు స్థానాలను ఆక్రమించాయి.
పదేండ్ల క్రితం చిన్న మొక్కగా మొదలైన యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ఇప్పుడు వటవృక్షం స్థాయికి ఎదిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన కొన్నిరకాల రుసుములతో యూపీఐ వేగానికి బ్రేకులు పడుతాయా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఎంతో కొంత చార్జీ చేయకుండా ఉచిత సేవ ఎన్నాళ్లు కొనసాగిస్తారనే వాదనలూ వినిపిస్తున్నాయి.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) యూపీఐ చెల్లింపుల విధానంలో కీలక మార్పులు చేసింది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ వినియోగదారుల్లో కలకలం సృష్టించింది. ఇకపై వ్యక్తుల నుంచి వ్యాపారికి (పీ2ఎం) రూ.2,000కు పైబడి జరిపే యూపీఐ చెల్లింపులపై 0.4% మేర మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధిస్తారు. ఈ సుంకం చెల్లింపు మొత్తం పెరుగుతున్నకొద్దీ మారుతుంది. ఈ అదనపు చార్జీ వినియోగదారులు కాకుండా వ్యాపారులే బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే రూ.2,000 లోపు లావాదేవీలకు ఎలాంటి చార్జీలూ ఉండవు. యూపీఐ వ్యవస్థను దీర్ఘకాలికంగా నిలబెట్టేందుకు, బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలకు ఆదాయం కల్పించేందుకు తీసుకున్నట్టుగా చెప్తున్న ఈ నిర్ణయం యూపీఐ చెల్లింపులపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రుసుమును వ్యాపారులే భరించాలని, వినియోగదారులపై దీనిని రుద్దకుండా చూస్తామని అంటున్నప్పటికీ ఈ వివరణ అంతగా నమ్మకం కలిగించలేకపోతున్నది. ఇందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి; వ్యాపారులు ఈ అదనపు భారాన్ని వినియోగదారుల మీదకు నెడుతారనే అనుమానాలు వ్యక్తం కావడం. రెండు; మొత్తంగా ఈ చెల్లింపులను నిరాకరించే అవకాశాలు ఉండటం. అయితే కొన్ని మినహాయింపులూ ఇవ్వడం గమనార్హం.
రూ.2,000 వరకు చెల్లింపులపై ఎలాంటి రుసుమూ ఉండదు. ఆ పైచిలుకు చెల్లింపులను వ్యాపారులు నగదు రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తే వినియోగదారుకు వేరే మార్గం ఉండదనేది తెలిసిందే. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో జరిపే చెల్లింపులపై ఈ ఎండీఆర్ రుసుము ఏమాత్రం వర్తించదు. వ్యక్తిగత స్థాయిలో జరిపే లావాదేవీలు పూర్తిగా ఉచితమే. యూపీఐ వ్యవస్థ నిర్వహణ, విస్తరణ వ్యయాన్ని ఇంతవరకు ప్రభుత్వం, బ్యాంకు లు, చెల్లింపు సంస్థలు భరిస్తున్నాయి.
ఎండీఆర్ ద్వారా ఆ భారాన్ని వ్యాపారుల మీదకు మళ్లిస్తున్నట్టు తాజా నోటిఫికేషన్ వెల్లడిస్తున్నది. కానీ ఇది అంతిమంగా వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద యూపీఐ వ్యవస్థను ఏర్పాటు చేసిన భారత్లో అందుకు అవసరమైన సాంకేతిక వ్యయం సమస్యగా మారినట్టు కనిపిస్తున్నది. ఫలితంగా వినియోగదారులు నగదు చెల్లింపులే నయమనుకునే రోజులు వస్తే అందులో ఆశ్చర్యం ఏముంటుంది?