జర భద్రం
ఈనెల 7న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల మొదటిరోజు నుంచే పాలకపక్షం తొండాట మొదలుపెట్టింది. ఫీజు రీయింబర్స్మెంట్, 22-ఏ వల్ల భూములు విక్రయించలేక జనం పడుతున్న తిప్పలు, కరెంటు కోతలు..ఇలా రాష్ట్రంలోని ఎన్నో సమస్యలపై చట్టసభల్లో చర్చ జరుగాల్సిన అవసరం ఉన్నది. తమ వైఫల్యాలను సభలో చర్చకు పెట్టేందుకు ముఖం చెల్లని ప్రభుత్వం..చర్చకు సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ శాసనసభ్యులను సభ లోపలికి అడుగు పెట్టకుండా కుట్ర పన్నింది. తొలిరోజు జరిగిన రసాభాస అందరికీ తెలిసిందే!
అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు పరిణామాల పట్ల ప్రతిపక్షాన్ని తప్పుబ ట్టడంపైనే రెండోరోజు సభ సాగింది. మూడవరోజు బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్తో ఏకపక్షంగా సాగుతున్న ఈ సమావేశాలు ముఖ్యమంత్రి సుదీర్ఘ ప్రసంగాలకు వేదికయ్యాయి. విలువైన సభా సమయంలో సీఎం ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క సమస్యపై అయినా చర్చ జరుగకుండా కాలం గడిచిపోతున్నది. అసెంబ్లీలో సస్పెండ్కు గురైన బీఆర్ఎస్ సభ్యులు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఇవ్వకుండా వారిపై రకరకాల కేసులు బనాయిస్తూ పోలీసులను పురమాయిస్తున్నారు. మహిళా పోలీసుల పట్ల అసభ్యంగా మాట్లాడారని, ప్రవర్తించారని కేసులు పెట్టడం వింతగా ఉన్నది. వాస్తవానికి బీఆర్ఎస్ మహిళా సభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరే సిగ్గుపడేలా ఉన్నది.
ఆ అంశంపై కమిటీ వేసి తేల్చుతామన్న సర్కార్ ఆ విషయంలో ఒక్క అడుగు వేసిందీ లేదు. స్పీకర్ పట్ల అమర్యాదగా వ్యవహరించారని ఇద్దరు బీఆర్ఎస్ శాసనమండలి సభ్యులను అరెస్టు చేసి స్టేషన్కు తీసుకెళ్లారు. వారి జ్యుడీషియల్ కస్టడీ కోసం పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. అయితే, పోలీసులు చూపిన కారణాలకు వారిని కస్టడీకి తీసుకునే అవసరం లేదని కోర్టు సూచించడంతో ష్యూరిటీతో వదిలేశారు. అది చాలదన్నట్లు అసెంబ్లీ ముందరి సంఘటనను పొడిగిస్తున్నట్లు ఓ రిజర్వు ఇన్స్పెక్టర్ ఫిర్యాదుపై కేటీఆర్ సహాయకులపై పోలీసులు కేసు పెట్టారు. – వారిద్దర్నీ అరెస్టు చేయవద్దని కోర్టు పోలీసులను ఆదేశించడంతో వదిలేశారు.
పోలీసు కస్టడీలో ఉన్నవారిపై స్టేషన్లో జరిగిన దాడికి సంబంధించిన వీడియో చూపాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ కక్షతో ఇలా కేసుల పేరిట బీఆర్ఎస్ నేతలను, వారి అనుయాయులను ఇబ్బందులు పెట్టడం ప్రభుత్వ దిగజారుడుతనాన్ని బయటపెడుతున్నది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొలి మూడు రోజుల్లో జరిగిన ఘటనలపై ప్రజలు ఏమనుకుంటున్నారని సీఎం ఫ్లాష్ సర్వే జరిపించారట. అసలు ఈ ఫ్లాష్ సర్వే జరుపాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారో అనేది ఆ సర్వేలో వెల్లడయ్యిందా? సర్వే ఫలితాలను తిప్పి చెప్పినట్టుగా రాష్ట్ర ప్రజల పరిస్థితి ఉన్నది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన 22-ఏ చట్టంపై సభలో అర్థవంతమైన చర్చ అవసరం.
అసెంబ్లీలో మొదలైన నిషేధిత భూముల చర్చ చివరకు యధావిధిగా కేసీఆర్ పైకి మళ్లి, ఆయన కుటుంబసభ్యులు, బీఆర్ఎస్ నేతల చరాస్తులపై విచారణ చేపట్టాలని నిర్ణయం వద్ద చర్చ ఆగింది. వారి ఆస్తులపై సమాచారం ప్రభుత్వం తీసుకోవచ్చు. అయితే అసెంబ్లీలో వారి భూముల చిట్టాను చదువుతూ సవాళ్లు విసిరే అవసరం ఉన్నదా? అసలు అసెంబ్లీలో చర్చించిన విషయాలు ఇవేనా? ప్రజా సమస్యలు ఎటుపోయాయి? ఎవరికి అక్రమ ఆస్తులున్నా వాటిపై విచారణ కొనసాగించడానికి తగిన శాఖలు ఉన్నాయి.
కార్యాలయ స్థాయిలో జరుగాల్సిన పనులపై అసెంబ్లీలో ప్రస్తావన అవసరమా? సభ బయట ఫీజు రీయింబర్స్మెంట్పై ఆందోళనకు దిగిన బీజేపీ సభలో మాత్రం నామమాత్రంగానే సర్కార్ను ప్రశ్నించింది. నిండుదనంతో సభ సాగుతూ ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం ఉండేందుకు వీలుగా బీఆర్ఎస్ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని బీజేపీ కోరింది. ఈ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు మాట్లాడుతూ సభ నిర్వహణకు రేవంత్రెడ్డి రూల్ బుక్ ఏమైనా ఉన్నదా? అనే ప్రశ్నలో ఏకవచన ప్రయోగం ఉన్నదని స్పీకర్ ఆయనను తప్పుపట్టారు. ఆ మూడు పదాలు కలిపిన మాటలో ‘గారి’ చేర్చే అవసరం లేదు.
వ్యక్తిని కాకుండా పుస్తకాన్ని ఉద్దేశించిన మాట వాడకంలో అలాగే ఉంటుంది. ఇంత చిన్న విషయాన్ని తప్పుపట్టిన స్పీకర్ సీఎం మాటలకూ ఎప్పుడూ అభ్యంతరం చెప్పనేలేదు. సభా చర్చల్లో దాపరికాలు ఉండకూడదు. ఏ విషయమైనా ప్రజలకు స్పష్టంగా తెలియాలి.
ఎన్నికల్లో యువతకు అవకాశం దక్కేలా పోటీ వయసు 21 ఏండ్లకు తగ్గించాలని ఆగస్టు మొదటివారంలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఈ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని సీఎం అన్నారు. కానీ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఆ మాట ముచ్చటే లేదు. ఎల్ నినోపై చర్చకు ఒక్కరోజు కేటాయించిన సర్కార్ ప్రజా సమస్యలపై, ఎన్నికల హామీలపై తెప్ప తగలేసినట్టేనా?
బద్రి నర్సన్