Rythu Bharosa | కొల్లాపూర్, ఫిబ్రవరి 15 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా (Rythu Bharosa)ను అర్హులకు మాత్రమే ఇవ్వాలని సాగుకు పనికిరాని భూములకు రైతు భరోసా అవసరం లేదని హడావిడిగా చేపట్టిన సర్వే రైతులను ఆందోళనలోకి నెట్టివేసింది. రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకున్నందుకు గత నెల ఆఖరిలో టార్గెట్ పెట్టడంతో రైతుల అవస్థలు పడ్డారు. రైతుల సంగతి అటు ఉంచితే రైతు భరోసా భారం తగ్గించుకునేందుకు వ్యవసాయ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది.
రైతు భరోసా డబ్బులు మూడు ఎకరాలలోపు రైతులందరికీ పడినట్లు ప్రభుత్వం చెబుతున్నా చాలామంది రైతులు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయని.. ఫోన్ దగ్గర పెట్టుకుని టకీ టకీ మనే మెసేజ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మాత్రం రైతులను గందరగోళంలో పెట్టి అసలు విషయాన్నీ దాచిపెడుతుంది. రైతులకు నిజాన్ని నిర్భయంగా వెల్లడించేందుకు నమస్తే తెలంగాణ సాగుకు యోగ్యం కాని భూముల సర్వేపై ఆరా తీసింది…
రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్లు చూపించి రైతులను మభ్యపెడుతుంది. రైతులు మాత్రం రైతు భరోసా డబ్బుల కోసం సెల్ ఫోన్లు దగ్గర పెట్టుకొని అంతా భ్రాంతియేనా అంటూ నిట్టూర్పుగా ఎదురుచూస్తున్నారు. పూర్తిస్థాయి మార్గదర్శకాలు లేకుండా రైతు భరోసా భారం నుంచి తప్పించుకునేందుకు సాగుకు యోగ్యం కాని భూముల సర్వేను తెరపైకి తెచ్చింది. సాగుకు యోగ్యం కాని భూముల సర్వేపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి.. సర్వే ఆధారంగా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే సర్వేలో అధికార పార్టీ నాయకుల పెత్తనం అధికారులపై ఉండడంతో చాలా వరకు అధికార పార్టీ నాయకుల సాగుకు యోగ్యం కాని భూముల వివరాలు రికార్డులోకి చేరలేదు. కానీ విపక్ష పార్టీ నాయకులు పేద రైతుల సాగుకి యోగ్యంకానీ భూముల వివరాలు పక్కాగా రికార్డులోకి ఎక్కాయి.
సాగుపై ఎసరు..
నాగర్ కర్నూల్ జిల్లావ్యాప్తంగా 745684.1 క్లియర్ ల్యాండ్ ఉంటే శుక్రవారం నాటికి 77, 71.91 ఎకరాలను సాగు యోగ్యం కానీ భూములుగా గుర్తించి రికార్డులోకి ఎంట్రీ చేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా 7771.91 ఎకరాలకు రైతు భరోసా రాదు. గోదాములు కోళ్ల ఫారం ఇతర కమర్షియల్ భూముల ను మినహాయించి మిగిలిన భూములు మళ్ళీ సాగులోకి తెచ్చుకునేందుకు అవకాశం ఉంది.
సర్వేలో గుర్తించిన భూములను అధికారులు అధికారికంగా రికార్డులోకి నమోదు కూడా చేశారు. సాగులోకి వచ్చే భూమికి రైతు భరోసా ఇవ్వాలి అంటే యోగ్యం కానీ భూముల జాబితా నుంచి తొలగించాలి కానీ ప్రస్తుతానికి ఆ సౌకర్యం లేదని తెలుస్తుంది.
ప్రభుత్వం చేసిన తప్పుకు అధికారులు బలి..
రాష్ట్రంలో వ్యవసాయ అధికారుల పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలా ఉంది. సాగుకు యోగ్యం గాని భూముల సర్వేపై అధికారికంగా ఎలాంటి ఆదేశాలు లేవు. సర్వేలో గందరగోల పరిస్థితిపై సందేహాలపై రైతుల అడిగే ప్రశ్నలకు వ్యవసాయ అధికారుల వద్ద సమాధానాలు లేవు.
ఉదాహరణకు ఒక సర్వే నెంబర్లో 5 ఎకరాల భూమి ఉంటే అందులో సాగుకు యోగ్యం కానీ 20 గుంటల భూమిని మాత్రమే రికార్డులోకి ఎక్కించే ఎలాంటి ఆప్షన్ లేదు. నిషేధ జాబితాలోకి ఎక్కించాలంటే సర్వే నెంబర్లో ఉన్న భూమి మొత్తాన్ని ఎక్కించాలి. లేదు అంటే పూర్తిగా వదిలేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు భరోసా డబ్బులు పడని రైతులు తమ కార్యాలయాలపై దండయాత్రకు వస్తున్నారు. ఇటీవల కొల్లాపూర్ మండలంలో చింతలపల్లి గ్రామానికి చెందిన రైతు వ్యవసాయ కార్యాలయానికి వచ్చి బెదిరించి వెళ్ళాడు. ప్రభుత్వం చేసిన తప్పుకు అధికారులు బలి అవుతున్నట్లు తెలుస్తుంది.
కల్లాలు, దొడ్లు సాగుకు యోగ్యం కానీ జాబితాలోకి..
వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే కళ్లాలు దొడ్లు కూడా రైతులు అనుమతి లేకుండా నిషేధ జాబితాలోకి వెళ్లాయి. ప్రతి రైతు గ్రామంలో పశువుల కోసం వాటి మేత కోసం కల్లాలను దొడ్లను ఏర్పాటు చేసుకొని అనాదిగా వాడుతున్నారు. ఇప్పటికి కూడా వ్యవసాయ అవసరాలు కోసం వినియోగిస్తున్నారు. అంతేకాదు పొలాలలో గుంటా రెండు గుంటల భూమిలో రాయి(నట్లు) ఉంటే వాటిని తీపించే ఆర్థిక సోమత లేకపోవడంతో అలాగే వదిలిపెట్టారు. గతంలో కేసీఆర్ సమయంలో వచ్చిన రైతుబంధు డబ్బులతో నట్లను తీపించుకునేవారు. ఇప్పుడు వాటిని జమా ఖర్చులలో భాగంగా రైతు భరోసా నుంచి తప్పించారు. ఇప్పుడు సొంత డబ్బులతో పొలాలలో రాయిని తీసివేసి సాగులోకి తెచ్చుకున్న రైతు భరోసా డబ్బులు పడే అవకాశం లేకుండా ప్రభుత్వం నిషేధ జాబితాలో పెట్టింది.
రైతు వ్యతిరేక ప్రభుత్వం : దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు
సాగుకు యోగ్యం కానీ భూముల పేరుతో కల్లాలకు, దొడ్లకు రైతు పొలాలలో ఉండే నట్లకు రైతు భరోసా చెల్లించకుండా రైతులను వ్యవసాయం నుంచి దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేసింది. ఇచ్చే రైతు భరోసా కూడా కొంతమందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వంతోపాటు రైతు వ్యతిరేక ప్రభుత్వమని దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.
Government Hospital | రికార్డ్ బ్రేక్.. 5 రోజుల్లో 200 సర్జరీలు