శరవేగంగా ప్రధాన రహదారి విస్తరణ
పూర్తి కావొస్తున్న పనులు
మక్తల్ టౌన్, మే 5: హైవే 167 పనుల్లో భాగంగా మక్తల్ పట్టణ రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. ఇంతవరకు పలు అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతుండగా మక్తల్ ప్రధాన రహదారి విస్తరణ పనులు ఒక కొలిక్కి వస్తున్నాయి. నేషనల్ హైవే 167 విస్తరణలో భాగంగా మక్తల్ పట్టణంలో 3కి.మీ మేర రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. రహదారికి ఇరువైపులా ఉన్న డబ్బాలు ఇతర షెడ్ల తొలగింపు, మండల పరిషత్ కార్యాలయం, వాటర్ ట్యాంక్ వద్ద, అదేవిధంగా రాయిచూర్ రోడ్డు , కన్యకాపరమేశ్వరి దేవాలయం నుంచి హైదరాబాద్ రోడ్డులోని నల్లజానమ్మ ఆలయం, చెరువుకట్ట వరకు దాదాపుగా కూల్చివేత పనులు పూర్తయ్యాయి. మరో వైపు రాయిచూర్ రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్ నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు ఇప్పటికే రోడ్డు విస్తరణ దాదాపుగా పూర్తయింది. భారత్ పెట్రోల్ బంక్ నుంచి ఐబీ వరకు అటు హైదరాబాద్ రోడ్డులో నారాయణపేట క్రాస్ నుంచి నల్ల జానమ్మ దేవాలయం వరకు మట్టి, కంకర పనులు జోరుగా సాగుతున్నాయి.
రోడ్డుపై ప్రయాణించే వాహన దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దుమ్ము, ధూళి లేవకుండా నీళ్లు చల్లుతున్నారు. నల్లజానమ్మ ఆలయం వద్ద ప్రధా న కల్వర్టు నిర్మాణం కావాల్సి ఉండగా రహదారి విస్తరణలో కోల్పోయిన మారె మ్మ ఆలయం,ఈదమ్మ ఆలయాన్ని ప్రత్యామ్యాయ స్థలాల్లో పునర్నిర్మించి ప్రతిష్టించేందుకు ఎమ్మెల్యే చిట్టెం సహకారంతో ఇప్పటికే పనులు ప్రారంభించారు.
మరికల్ నుంచి చెక్పోస్టు వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు నిర్వహిస్తుండగా మక్తల్ పట్టణంలో మినహా మిగతా పనులు పూర్తయ్యాయి. పట్టణం లో త్వరలో విస్తరణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని అధికారులు తెలిపారు.