మందుగుండు సామగ్రి స్వాధీనం
వివరాలు వెల్లడించిన ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్
ములుగు, మే31(నమస్తే తెలంగాణ) : అటవీ ప్రాంతంలో మందుగుండు సామగ్రిని అమర్చుతున్న మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యుడిని ములుగు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. వెంకటాపురం(నూగూరు) మండలం పామునూరు, తడపాల, చెలిమెలా, జెల్లా గ్రామాల మిలీషియా సభ్యులు పామునూరు అటవీ ప్రాంతంలో సమావేశమవుతున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఈ నెల 29న రాత్రి వెంకటాపురం సీఐ, ఎస్సై, స్పెషల్ పార్టీ టీం, ములుగు బాంబు స్కాడ్ బృందం, సీఆర్పీఎఫ్ 39/బీఎస్, ఇతర పోలీస్ సిబ్బంది ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టింది. ఈ క్రమంలో 30వ తేదీన ఉదయం 11గంటలకు పోలీస్ పార్టీని చంపడానికి పేలుడు పదార్థాలు నాటుతున్న కొంతమంది సభ్యులు పోలీసులను చూసి తప్పించుకోవడానికి ప్రయత్నించగా, వారిలో ఒకరైన బూదు అనే మిలీషియా సభ్యుడు పట్టుబడ్డాడు. అతడి నుంచి మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బూదు వెంకటాపురం(నూగూరు) మండలం జెల్లా గ్రామానికి చెందిన గొత్తికోయ. ఇతను వెంకటాపురం మండలం, పెడ్డా, జెల్లా, పామునూరు గ్రామాలతోపాటు చిన్నఉట్లపల్లి, రాంపురం, భీమారం, కస్తూరిపాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పూజారికంకర్ గ్రామాల మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యుడిని పనిచేస్తున్నాడు.
ఇతడిపై గతంలో పీఎస్ వెంకటాపురంలో కేసులు ఉన్నాయి. మావోయిస్టులకు ఆహారం సరఫరా చేస్తూ ఆశ్ర యం కల్పించేవాడు. దీంతో వారు ఇతడికి శిక్షణ కూడా ఇచ్చారు. కూంబింగ్కు వచ్చే పోలీసులను లక్ష్యంగా చేసుకొని అటవీ ప్రాంతంలో, పాలెంవాగు ప్రాజెక్టు వైపు పేలుడు పదార్థాలను అమర్చేందుకు యత్నించాడు. యూఏపీఏ చట్టం 1967లోని కఠినమైన సెక్షన్ కింద నమోదైన 28 ఉగ్రవాద కేసుల్లో సైతం బూదు పాల్గొన్నాడు. 2020 అక్టోబర్లో అలుబాకలో మదురి భీమేశ్వర్రావు అలియాస్ భీమా హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. బూదు నుంచి 40 మీట ర్ల కార్డెక్స్ వైర్, 4 డిటోనేటర్లు, ఒక వాకీటాకీ, 2 ప్రెజర్ కుక్కర్ బాం బులు, 2 టిఫిన్ బాక్స్ బాంబులు, 2 బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వైర్ల కట్టలు, ల్యాండ్మైన్స్ తయారీకి ఉపయోగించే వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై పెడదారి పట్టొద్దని ఎస్పీ కోరారు. మావోయిస్టు పార్టీలో చేరే వారిపై పోలీస్ శాఖ డేగకన్ను వేసిందని చెప్పారు. యువత సన్మార్గంలో నడిచి తల్లిదండ్రులు, సమాజానికి మంచి పేరు తెచ్చే తేవాలని సూచించారు. ఈ సమావేశంలో ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ఆలం, ఓఎస్డీ శోభన్కుమార్, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అమిత్కుమార్యాదవ్, వెంకటాపురం(నూగూరు) సీఐ శివప్రసాద్, ఏటూరునాగారం సీఐ కిరణ్, ఎస్సై తిరుపతి, రిజర్వు ఇన్స్పెక్టర్లు స్వామి, కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.