పూడ్చివేసిన రియల్టర్లు
చెరువులోకి వెళ్లే మార్గంలేక రోడ్డుపై నిలిచిన నీరు
కలెక్టర్ ఆదేశాలతో జేసీబీ సాయంతో కాల్వ తవ్వకం పనులు
పర్యవేక్షించిన రోడ్లు భవనాల శాఖ ఈఈ
జయశంకర్ భూపాలపల్లి, జూలై 14 (నమస్తే తెలంగాణ) : తుమ్మలకుంటలోకి వెళ్లే వరద కాల్వకు రియల్టర్లు ఎసరుపెట్టారు. దానిని ఆక్రమించుకుని పూర్తిగా పూడ్చివేశారు. దీంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా కేంద్రంలోని వందపడకల దవాఖానకు వెళ్లే రహదా రి పూర్తిగా జలమయమైంది. జాతీయ రహదారి 353సికి అవతలి వైపు ఉన్న అటవీ, మున్సిపాలిటీ కార్యాలయం పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు గుడ్ మార్నింగ్ స్కూల్ పక్కన ఉన్న వరద కాలువ నుంచి దవాఖాన ముందు ప్రత్యేకంగా నిర్మించిన కాలువ ద్వారా తుమ్మలకుంట చెరువులోకి చేరుకుంటాయి. కాగా, దవాఖానకు ఎదురుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్ చేసి కాలువను పూడ్చి కనబడకుండా చేశారు. గతంలో మాదిరిగా తుమ్మలకుంట చెరువులోకి వెళ్లాల్సిన వరద నీరు దవాఖాన ముందు నిలిచిపోయింది. దీని వల్ల దవాఖానాలోకి రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది.
కలెక్టర్ ఆదేశాలతో కాల్వ తవ్వకం పనులు
దవాఖానాలోకి వెళ్లే దారి పూర్తిగా జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయంగా కలుగకుం డా చూడాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు రోడ్లు, భవనాల శాఖ ఈఈ వెంకటేశ్వర్లు వరద కాలువ క్లియర్ చేసే పనులను పరిశీలించారు. జేసీబీ సాయంతో రియల్టర్లు పూడ్చి వేసిన కాలువలో మట్టిని తీసి, గతంలో ఉన్న కాలువకు అనుసంధానం చేయించి, వరద నీటిని కాలువ ద్వారా చెరువులోకి చేరేవిధంగా చర్యలు చేపడుతున్నారు.