కాకతీయుల పాలనకు సాక్ష్యంగా ఆలయం
2008లో దాతల సాయంతో పునర్నిర్మాణం
భారతదేశంలోనే మహేంద్రుల ఏకైక పుణ్యక్షేత్రం
కోర్కెలు తీర్చే కొంగుబంగారం కంకలమ్మ
కౌటాల, నవంబర్ 26 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని శ్రీ కంకలమ్మ కేతేశ్వర ఆలయం కాకతీయుల పాలనకు సాక్ష్యంగా నిలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక పురాతన ఆలయంగా శ్రీ కంకలమ్మ కేతేశ్వర ఆలయం పేరొందింది. కాకతీయ రాజుల కాలం నాటి ప్రాచీన దేవాలయంగా పేరొందింది. భారతదేశంలోనే మేదరు(మహేంద్రుల)ల ఆరాధ్య దైవంగా ఉన్న ఏకైక ఆలయం ఇది. వందల ఏళ్ల క్రితం డంగుసున్నంతో భారీ రాతి దిమ్మెలతో ఆలయాన్ని నిర్మించినట్లు అవగతమవుతున్నది. మధ్య యుగంలో ఇక్కడి దేవాలయాలు, విగ్రహాలను కొందరు ముష్కరులు ధ్వంసం చేసినట్లుగా పూర్వీకులు చెబుతారు. కౌటాల క్షేత్రములో అక్కడక్కడా పొలాల గట్ల పైన వినాయకుడు, కుమారస్వామి, నంది, శృంగి, భృంగి, బ్రహ్మ, విష్ణు మొదలగు దేవతల విగ్ర హాలు శిథిలావస్థలో కనిపిస్తాయి. గుట్టపై ఆలయం ముందు పెద్ద నీటి కొలను ఉంది.
ఆలయ పునర్నిర్మాణం
కాగజ్నగర్ పట్టణానికి చెందిన సుల్వ కనకయ్య- కల్యాణి దంపతుల సాయంతో శ్రీ కంకలమ్మ కేతేశ్వర ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. 17-03-2008
సోమవారం రోజున వేదపండితులు మహా గణపతి, నవగ్రహ రుద్రహోమములు నిర్వహించి పనులు ప్రారంభించారు. 13-11-2009న వేద పండితుల మంత్రోచ్ఛర ణల మధ్య కంకలమ్మ దేవి, కేతేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు, ధ్వజ స్తంభములు, నవగ్రహాలు, నాగదేవత విగ్రహాలకు ప్రతిష్ఠాపన చేశారు.
కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా..
కౌటాల క్షేత్రంలోని గుట్టపై వెలసిన శ్రీ కంకలమ్మ- కేతేశ్వర స్వామిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఏటా కార్తీక మాసం చివరి ఆదివారం పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు. కౌటాల మండల కేంద్రం నుంచేగాకుండా చుట్టు పక్కల దాదాపు 100కు పైగా గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి పూజలు చేసి ఇంటికి చేరేలోగా తప్పనిసరిగా వర్షం కురుస్తుందని భక్తులు చెబుతుంటారు.
ఆలయానికి చేరుకోవాలిలా..
కౌటాల మండల కేంద్రంలోని శ్రీ కేతేశ్వర-కంకలమ్మ ఆలయానికి చేరుకునేందుకు కాగజ్నగర్ నుంచి కౌటాలకు ప్రత్యేక బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. అంతేగాకుండా సిర్పూర్(టీ) వరకు రైల్వే మార్గం కూడా ఉంది. కాగజ్నగర్ నుంచి 40 కిలో మీటర్లు, సిర్పూర్(టీ) నుంచి 20 కిలో మీటర్ల దూరం ఉంటుంది. మండల కేంద్రానికి 6 కిలో మీటర్ల దూరంలో పెన్గంగ, 13 కిలోమీటర్ల దూరంలో ప్రాణహిత నదులు జీవధారగా ప్రవహిస్తున్నాయి.
ఏటా వైభవంగా జాతర
కంకలమ్మ గుట్టపై శ్రీ కేతేశ్వర-కంకలమ్మ జాతరను ఏటా కార్తీక మాసంలో చివరి ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో కౌటాల క్షేత్రానికి సమీపంలోని పవిత్ర పెన్గంగ, ప్రాణహిత నదుల్లో కార్తీక స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ జాతర మహోత్సవానికి తెలంగాణ ప్రాంతం నుంచేగాకుండే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్ రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ నెల 28న జాతర నిర్వహించనుండగా, ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
అమ్మవారి కృపతోనే ఆలయ నిర్మాణం
అమ్మవారి కృపతోనే కంకలమ్మ-కేతేశ్వర ఆలయం సాధ్యమైంది. నాడు ఇక్కడ పెద్ద బండలు, కూలిపోయిన గుడి మాత్రమే ఉండేది. గుట్టపైకి వెళ్లాలంటే కాలినడకా కష్టంగా ఉండేది. ఎలాగైనా ఆలయాన్ని నిర్మించాలని అమ్మవారికి మొక్కుకొని భక్తుల వద్దకు వెళ్లాం. వారి సహాయంతో రెండేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తయ్యింది.