న్యూఢిల్లీ, జూన్ 21: కేంద్రంలోని ఎన్డీయే సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలన్నీ ఏకం అవుతున్నాయా.. విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా.. అంటే ఇటీవలి పరిణామాలను గమనిస్తే అవుననే తెలుస్తున్నది. ప్రశాంత్ కిశోర్, శరద్ పవార్తో మళ్లీ భేటీ అయ్యారు. సోమవారం ఢిల్లీలో ఇద్దరి మధ్య గంటన్నర పాటు రహస్య సమావేశం జరిగింది. ఈ ఇద్దరూ ఈ నెలలో భేటీ కావడం ఇది రెండో సారి. ప్రశాంత్ కిశోర్తో భేటీ అనంతరం పవార్.. మంగళవారం విపక్షాల సమావేశం జరుగనున్నట్టు ప్రకటించారు. 15 రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు అందాయి. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో పవార్ నివాసంలో ఈ సమావేశం జరుగనున్నది. దీంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ఎదుర్కోవడానికి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అవుతుందన్న ఊహలకు మరింత బలం చేకూరింది. పవార్ అన్ని విపక్షాలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు.
ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర
పవార్, కిశోర్ మధ్య మొదటి భేటీ ఈ నెల 11న ముంబైలోని పవార్ నివాసంలో జరిగింది. అప్పుడు 3 గంటలకు పైగా చర్చలు సాగాయి. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్కు అన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. ఆ సత్సంబంధాలతోనే ఆయన కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తున్నది. బెంగాల్ సీఎం మమత కూడా ‘మోదీని గద్దె దించడానికి కలిసి పోరాడదాం’ అని గతంలో పిలుపునిచ్చారు. కాగా, థర్డ్ ఫ్రంట్ ఊహాగానాలను ప్రశాంత్ కిశోర్ కొట్టిపారేశారు. బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ లేదా ఫోర్త్ ఫ్రంట్ విజయవంతం అవుతాయని తాను భావించడం లేదన్నారు. అయితే అందుకు కారణాలను పేర్కొనలేదు. పవార్తో భేటీకి ముందు ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
బెంగాల్లో ఓటమితో మారిన పరిస్థితులు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిస్థితి బెంగాల్ ఎన్నికలకు ముందు.. తర్వాత అని చెప్పుకోవచ్చు. ఎన్నికలకు ముందు అజేయ శక్తిలా ఉన్న బీజేపీ బెంగాల్లో ఓటమితో తమపై ఉన్న నమ్మకాన్ని కోల్పోయింది. దీంతో బీజేపీ మిత్రపక్షాలు పునరాలోచనలో పడ్డాయి. మరోవైపు, బీజేపీ అసమర్థత వల్లే కరోనా విజృంభించిందని, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ప్రజలు, ప్రతిపక్షాలు భావిస్తున్నారు. దీంతో మిత్రపక్షాలను బుజ్జగించేందుకు మంత్రివర్గ విస్తరణ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.