కల్లూరు:తోటి స్నేహితుడు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడి తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.పేదరికంలో ఉన్నఅతనికి కష్టకాలంలో మేమున్నామంటూ ఆ గ్రామస్తులు, స్నేహితులు అండగా నిలిచారు. అతని చికిత్స కోసం రూ.1.31లక్షల ఆర్థికసాయం అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన కల్లూరు మండల పరిధిలోని తాళ్లూరు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గీతకార్మికుడు మట్టా కృష్ణార్జున్ వృత్తిలో భాగంగా తాటిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు జారిపడటంతో తీవ్రగాయాలతో ఖమ్మంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ విషయం తెలుసుకున్నతాళ్లూరు గ్రామానికి చెందిన స్నేహితులు నాయుడు శివ, వంగల చిన్నహనుమంతరావు, కొనకాల చెన్నారావు, లక్ష్మినారాయణ, రేసు రామకృష్ణ, కటికల హనుమంతరావు, వడ్డెబోయిన అచ్యుతరావు, వైరాకు చెందిన కొందరు స్నేహితులు..డాక్టర్ పామర్తి వెంకటేశ్వర్లు, పామర్తి కృష్ణ, నర్వనేని పెద్ద అంజయ్య, మర్రి రఘు, మాజీ సర్పంచ్ ఈడే జయలక్ష్మి, ఈడే వెంకటకృష్ణ, చంద్రరావు, నర్వనేని కృష్ణ, గ్రామస్తుల సహకారంతో రూ.1.31లక్షలు సేకరించి బాధితుని భార్యకు అందజేశారు. సాయం అందించినవారికి కృష్ణార్జున్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.