మామిళ్లగూడెం, ఏప్రిల్ 23 : ఖమ్మం లోక్సభ నియోజకవర్గానికి నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మంగళవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డికి చెందిన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆ పార్టీ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, నిరంజన్రెడ్డి, బొర్రా రాజశేఖర్, నూకల నరేశ్రెడ్డి, రామ్మూర్తినాయక్, ఎండి.ముస్తఫా, మాలీదు జగన్, జొన్నగడ్డ రవి, రమేష్ దాఖలు చేశారు. సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా రైస్ అన్వర్, స్వతంత్ర అభ్యర్థిగా కట్టకొజ్వల నాగేశ్వరరావు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా ఏవీజే.ప్రసాద్, స్వతంత్ర అభ్యర్థిగా అవుటపల్లి రామలింగేశ్వరరావు ఒక సెట్ చొప్పున నామినేషన్ దాఖలు చేశారు.
బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్రావుకు చెందిన రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆ పార్టీ నాయకులు సుగ్గుల వెంకటేశ్వరరావు గుప్తా, గంటేల విద్యాసాగర్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా కాశిమల్ల నాగేశ్వరరావు ఒక సెట్, షేక్ సిరాజొద్దీన్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ స్వీకరించారు. కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో ఇంకా ఆ పార్టీ అధిస్టానం స్పష్టత ఇవ్వలేదు. దీంతో రఘురాంరెడ్డి తరఫున ఆ పార్టీ నాయకులు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.