ఖమ్మం కార్పొరేషన్లో ఎన్నికల సందడి షురూ
ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాల స్వీకరణ
నేటి సాయంత్రం లోపు పరిష్కారం
14న తుది ఓటర్ల జాబితా విడుదల
ఇదే రోజు పోలింగ్ కేంద్రాల ప్రకటన
ఖమ్మం, ఏప్రిల్ 11 : ఖమ్మంలో కార్పొరేషన్ ఎన్నికల వేడి మొదలైంది.. కార్పొరేషన్ యంత్రాంగం ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రకటించి పోలింగ్ కేంద్రాలను గుర్తించగా వాటిపై అనేక అభ్యంతరాలు వచ్చాయి.. అధికారులు సోమవారం సాయంత్రంలోపు వాటిని పరిష్కరించి 14వ తేదీన తుది ఓటర్ల జాబితా, ఫైనల్ అయిన పోలింగ్ కేంద్రాల వివరాలు ప్రకటించనున్నారు.. దీంతో ఇక ఎన్నికల నోటిఫికేషనే తరువాయి అని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి.. డివిజన్ల వారీగా రిజర్వేషన్ల ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి..
ఖమ్మం కార్పొరేషన్లో ఎన్నికల సందడి ప్రారంభమైంది. అధికార పార్టీతో పాటు వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సంగ్రామంలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. మరోవైపు అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో తలమునకలైంది. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. 2016లో జరిగిన ఎన్నికల్లో 50 డివిజన్లు మాత్రమే ఉండగా వాటికి తగినట్లుగా అధికారులు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ దఫా ఎన్నికల్లో సుమారు 2, 80,000 మందికి పైగా ఓటర్లు నమోదు కావడంతో పాటు కరోనా నేపథ్యంలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలు కేటాయిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు గాను 60 మంది రిటర్నింగ్, మరో 60 మంది సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించారు. వీరందికీ సోమవారం నగరంలో శిక్షణ ఇవ్వనున్నారు. పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే 365 గుర్తించగా, వివిధ రాజకీయపార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాల దృష్ట్యా మరో 10 నుంచి 20 వరకు పోలింగ్ కేంద్రాలు పెరిగే అవకాశం ఉంది. ఆదివారం మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఆయా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్కు నివేదిక అందజేశారు. రెండు రోజుల్లో తుది ఓటర్ల జాబితా వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆ లోపుగా పోలింగ్ కేంద్రాలను కూడా పైనల్ చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
అభ్యంతరాలు ఇలా..
కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజన అనంతరం ఓటర్ల గణనకు లెక్కింపు పూర్తయింది. వారం రోజులుగా అధికారులు అన్ని డివిజన్లలో కులాల వారీగా ఓటర్లను లెక్కించారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై 205 అభ్యంతరాలు వచ్చాయి. వీటిలో ఆయా రాజకీయ పార్టీల నాయకులతో పాటు, డివిజన్లలో ఉన్న ఓటర్లు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీటిలో ప్రధానంగా దూరంగా పోలింగ్ స్టేషన్లు కేటాయించారని, ఒక డివిజన్లోని ఓటర్లను మరో డివిజన్లోని పోలింగ్ స్టేషన్కు కేటాయించారనే అంశాలపై అభ్యంతరాలు వచ్చాయి. సోమవారం సాయంత్రం లోపు కార్పొరేషన్ అధికారులు వీటిని పరిష్కరించనున్నారు. మంగళవారం (13వ తేదీ) ఉగాది సందర్భంగా సెలవు కావడంతో 14వ తేదీ తుది ఓటర్ల జాబితాను వెల్లడించనున్నారు. ఇదే రోజున పోలింగ్ కేంద్రాల తుది జాబితానూ ప్రకటించనున్నారు.
రిజర్వేషన్ల ప్రకటనపై ఎదురుచూపు..
మున్సిపల్ కమిషనరేట్ డైరెక్టరేట్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే డివిజన్ల వారీగా రిజర్వేషన్ల ప్రకటన వెలువడనుంది. ఈ ప్రకటనపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్లు తారుమారు అవుతాయనే ఉద్దేశంతో కొందరు తమ సతీమణులు, అనుచరులు, సన్నిహితులను రంగంలోకి దించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదివారం నుంచే ఎన్నికల సంగ్రామానికి శ్రీకారం చుట్టారు. నగరంలో పలు డివిజన్లలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ, వామపక్షపార్టీలూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. డివిజన్ల వారీగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.
మూడు డివిజన్లకు ఒకే చోట నామినేషన్ల స్వీకరణ..?
ఖమ్మం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్లో ఒక రిటర్నింగ్ అధికారిని, సహాయ రిటర్నింగ్ అధికారిని నియమించారు. భద్రత దృష్ట్యా మూడు డివిజన్లకు ఒకేచోట నామినేషన్లను స్వీకరించే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ విషయంపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. సీపీ విష్ణు ఎస్ వారియర్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సోమవారం పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే వస్తుందని రాజకీయపార్టీల నేతలు భావిస్తున్నారు.
స్ట్రాంగ్రూంలు, కౌంటింగ్ హళ్ల పరిశీలన
ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 11: ఖమ్మం నగరపాలక సంస్ధ సాధారణ ఎన్నికల సంసిద్ధత ప్రక్రియలో భాగంగా బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్రూంలు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు, కౌంటింగ్ హాళ్ల ఏర్పాట్లకు నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల భవనాలను నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి ఆదివారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. కళాశాల ప్రాంగణంలోని నూతన భవనంలోపాటు ఇతర తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు. కళాశాల ప్రాంగణంలోని ప్రవేశ మార్గం పక్కన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, లోపలి భాగంలో రిసెప్షన్ కేంద్రం ఏర్పాటుకు అదేవిధంగా స్ట్రాంగ్రూంలు, కౌంటింగ్ హాళ్లకు అనువైన హాళ్లను కలెక్టర్ పరిశీలించాచరు. ఏర్పాట్లపై నగరపాలక సంస్థ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు చేశారు. నగరపాలక సంస్ధ అధికారులు, అర్బన్ తహసీల్దార్ శైలజ, ఏసీపీ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
రోజూ తినే ఆహారంలో ఇవి ఉంటే ఆరోగ్యం మీ వెంటే
కీరదోస తింటే 7 రోజుల్లో 7 కిలోల బరువు తగ్గుతారా?
గొంతునొప్పి తగ్గాలా..అయితే వీటిని తీసుకోండి..!
నొయిడాలో ఫైర్.. ఇద్దరు చిన్నారుల దుర్మరణం