Tragedy | మాగనూరు (కృష్ణ) జులై 10 : నారాయణపేట జిల్లా కృష్ణా మండల కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఓ మహిళ నవజాత మగ పసికందును రైల్వే స్టేషన్ ఆవరణలో వదిలేసి వెళ్లిపోవడం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం పసికందు ఏడుపు వినిపించడంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది గమనించారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు శిశువును వైద్య పరీక్షల నిమిత్తం సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితిని నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, పసికందును వదిలేసి వెళ్లిన మహిళ ఎవరు? ఏ పరిస్థితుల్లో ఈ ఘటనకు పాల్పడింది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇలా పసికందును వదిలేసి వెళ్లడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.