Puvvada ajaykumar | ఖమ్మం : అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి తదితర హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు వేణును ఆస్పత్రిలో పరామర్శించిన ఆయన, బాధితుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యువకుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
అనంతరం మీడియాతో పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్ లేక నిరుద్యోగులంతా నిరుత్సాహంతో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. నోటిఫికేషన్లు వేయడం లేదని నిరుత్సాహంతో, ఫ్రస్టేషన్తో ఉన్న యువత ఒత్తిడిలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ల ప్రాణాల మీదికి తెచ్కుకుంటున్నారన్నారు. నిరుద్యోగుల ఆశలను వమ్ము చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, వారి న్యాయమైన హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.

