SIIMA Awards | సౌత్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2026 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియం వేదికగా రెండు రోజుల పాటు ఈ అవార్డుల వేడుక జరగనుంది. తొలిరోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు సినీ తారలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు సందడి చేశారు. గత ఏడాది దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలు, అద్భుతమైన నటన కనబరిచిన నటీనటులు, తమ ప్రతిభతో సినిమాలకు మరింత బలాన్ని చేకూర్చిన సాంకేతిక నిపుణులకు ఈ వేడుకలో పురస్కారాలు అందజేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఈసారి తేజ సజ్జా కీలక పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ‘మిరాయ్’ చిత్రంలో తన నటనకు గాను ఆయన ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు. విభిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న తేజ సజ్జాకు సైమా వేదికపై ఈ పురస్కారం దక్కడం అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ‘మిరాయ్’లో ఆయన కనబరిచిన నటనకు ఈ అవార్డు గుర్తింపుగా నిలిచింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్న ఐశ్వర్య రాజేశ్ కూడా సైమా అవార్డును అందుకున్నారు. ఈ చిత్రంలోని నటనకు గాను ఆమె ఉత్తమ నటి (క్రిటిక్స్) పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు.
సంక్రాంతి సీజన్లో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్ పాత్రకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు అదే నటనకు సైమా వేదికపై గుర్తింపు రావడం విశేషంగా మారింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన బుల్లిరాజు అలియాస్ భీమల రేవంత్కు కూడా సైమా పురస్కారం దక్కింది. ఈ చిత్రంలో తన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్న ఆయన ఉత్తమ హాస్య నటుడు అవార్డును అందుకున్నారు. సినిమాలోని హాస్య సన్నివేశాల్లో బుల్లిరాజు పాత్ర ప్రత్యేకంగా నిలిచిన నేపథ్యంలో ఈ అవార్డు ఆయనకు మరో గుర్తింపుగా మారింది. సైమా 2026లో సంగీత విభాగంలోనూ తెలుగు సినిమాలకు అవార్డులు లభించాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి గాను రమణ గోగుల ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డును అందుకున్నారు. అలాగే ‘కోర్టు’ చిత్రానికి గాను సమీరా భరద్వాజ్ ఉత్తమ నేపథ్య గాయనిగా అవార్డును సొంతం చేసుకున్నారు. దక్షిణాది సినిమా ప్రపంచానికి చెందిన ప్రతిభను ఒకే వేదికపైకి తీసుకొచ్చే సైమా వేడుకలు ప్రతి ఏడాది సినీ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి.