బోనకల్లు, జూలై 7: గ్రామాలన్నీ హరితవనంలా పచ్చదనంతో శోభిల్లాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని జానకీపురం గ్రామంలో బుధవారం ఆయన పల్లెప్రకృతివనాన్ని ప్రారంభించారు. అనంతరం పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. తరువాత హెల్త్ సబ్సెంటర్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలన్నింటినీ పచ్చనిహారాలుగా మార్చేందుకు సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఇప్పటికే గ్రామాల్లో ఏడు విడతలుగా చేపట్టిన హరితహారం విజయవంతం కావడంతో గ్రామాలు పచ్చని చెట్లతో కళకళలాడుతున్నాయని అన్నారు. ప్రకృతివనాలు ఆహ్లాదాన్ని కల్పిస్తున్నాయన్నారు. ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిలకా వెంకటేశ్వర్లు, ఎంపీడీవో జీ.శ్రీదేవి, ఎంపీవో శ్రీనివాసరెడ్డి, రావినూతల సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు బంధం శ్రీనివాసరావు, ఇటికాల శ్రీనివాసరావు, కొనకంచి నాగరాజు, రెడ్డబోయిన ఉద్దండు, తోటకూర అనంతరాములు, కాకాని శ్రీనివాసరావు, యనిగండ్ల మురళి, ఈజీఎస్ టీఈ రంజిత్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.