– మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి.యాకూబ్ పాషా
రుద్రంపూర్, ఫిబ్రవరి 21 : రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో మైనార్టీల కోసం రెండు ప్రత్యేక పథకాలు ప్రవేశ పెట్టినట్లు మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి.యాకూబ్ పాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు టీజీఓబీఎంఎంఎస్ పోర్టల్లో మార్చి 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న ముస్లిం, బౌద్ధులు, సిక్కులు, పార్శీలు, జైనులు స్వయం ఉపాధి పొందేందుకు గాను ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ పథకం యూనిట్ విలువ రూ.1.50 లక్షలని, సబ్సిడీ రూ.1.20 లక్షలు, అభ్యర్థి వాటా రూ.30 వేలు ఉంటుందన్నారు. అర్హతలు ఆధార్, ఫుడ్ సెక్యూరిటీ కార్డుతో పాటు వయసు 21 నుండి 40 సంవత్సరాలు ఉండాలన్నారు.
పాన్కార్డు, ఆర్టీఏ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని, వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉండాలన్నారు. అదేవిధంగా తురకకాశి పథకం యూనిట్ విలువ రూ.60,000 (రూ.10 వేలు టూల్కిట్స్, రూ.50 వేలు జనరేటర్). దీనికి అభ్యర్థి తురక కాశి ముస్లిం అయి ఉండాలన్నారు. ఆధార్, ఫుడ్ సెక్యూరిటీ కార్డుతో పాటు వయసు 21 నుండి 55 సంవత్సరాలు తప్పనిసరి అన్నారు. తురకకాశి ముస్లిం ధ్రువీకరణ పత్రం కమ్యూనిటీ అసోసియేషన్ వారు ధ్రువపరచినది అందించాలన్నారు. ఇతర సమాచారం కోసం 8520860785 నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు.