దమ్మపేట: ఏజెన్సీ మండలమైన దమ్మపేట, మల్కారం గ్రామాలకు చెందిన ఇద్దరు రైతులకు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్ తొమర్ చేతులమీదుగా సర్టిఫికెట్ల ప్రధానంచేశారు. హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ నోవోటెల్లో ఏర్పాటు చేసిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ఫామ్ సదస్సులో పామాయిల్ రైతు ఉత్పత్తిదారు సంఘాలైన దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి, సత్తుపల్లికి చెందిన రైతులకు కేంద్రమంత్రి ఈ సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. దమ్మపేటకు చెందిన ఆంగోతు బాలాజీ, మల్కారం గ్రామానికి చెందిన మహిళా రైతు ఎడ్ల వెంకమ్మలు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభించినందుకు గుర్తింపు దక్కింది. ఈ సమావేశంలో తొమర్ మాట్లాడుతూ తెలంగాణలో ఆయిల్ఫామ్ ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, రైతులు కూడా ఎంతో ఆసక్తితో ఈ పామాయిల్సాగు చేపడుతున్నారన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రాష్ట్ర రైతుబంధు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, బి.బాబు, మరియన్న, సందీప్, పామాయిల్ మిల్లర్లు పాల్గొన్నారు.