మణుగూరు రూరల్ : సింగరేణిలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీబీజీకేఎస్ సిద్ధంగా ఉన్నదని వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావు అన్నారు. కరోనా కాలంలో సింగరేణి యాజమాన్యం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వనని చెప్పడం, బోర్డు ఏర్పాటు చేయకపోవడం యాజమాన్యం తప్పిదమే కానీ కార్మికులదో, వారి కుటుంబ సభ్యులదో కాదన్నారు. అదేవిధంగా డిపెండెంట్ ఉద్యోగంలో కుటుంబ సభ్యులందరి సంతకం కావాలనడంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని దీనిని టీబీజీకేఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నదన్నారు. ఇది పూర్తిగా ఆ మాజీ కార్మికుడి ఇష్టానుసారం జరగాలన్నారు.
కార్మికుల సమస్యలపై డిసెంబర్ 31న కీలక ప్రకటన వెలువడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయాలపై చర్చలు జరుగుతున్న సమయంలో జాతీయ పార్టీలు తమను కూడా చర్చలకు పిలవాలని ఆర్ఎల్సీకి లేఖ రాయడం విచిత్రంగా ఉందన్నారు. జాతీయ సంఘాలు ప్రవర్తిస్తున్న తీరును కార్మికులు గుర్తించాలన్నారు. సింగరేణి కార్మికులకు ఓ ప్రైవేట్ బ్యాంకు జీతభత్యాలు పడితే ఎటువంటి ప్రీమియం చెల్లించకుండా ప్రమాద బీమాలో భాగంగా కార్మికుడికి రూ.40-50లక్షలు, కాంట్రాక్ట్ కార్మికుడికి రూ.15-20లక్షలు ఇచ్చే విధంగా అంగీకారం తెలిపాయని, ఇదే విషయంపై యాజమాన్యంతో చర్చిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు అబ్దుల్ రవూఫ్, నాయకులు వీరభద్రం, కోటా శ్రీనివాసరావు, కాపాశివాజీ, వర్మ, బుర్రా వెంకటేశ్వర్లు, టంగుటూరుశ్రీను తదితరులున్నారు.