భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 10: ఎస్సీ, ఎస్టీలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశించారు.కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అనుదీప్ అధ్యక్షత నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ చట్టం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2013 నుంచి ఇప్పటివరకు 667 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, వీటిలో 97 కేసులు తప్పుడు కేసులని తేలిందన్నారు. 570 కేసులు నిరూపణ అయ్యాయన్నారు. 490 కేసుల్లో చార్జిషీట్ దాఖలయ్యాయన్నారు. 197 కేసులు అక్విటెడ్ అయ్యాయని, 18 కేసుల్లో పరస్పర రాజీ జరిగిందన్నారు. 266 కేసులు ట్రయల్లో ఉన్నాయన్నారు. 101 కేసులు విచారణ స్థాయిలో ఉన్నట్లు వెల్లడించారు. 155 కేసులకు సంబంధించి 148 మందికి రూ.76.44 లక్షలు పరిహారం అందిందన్నారు. చండ్రుగొండ మండలం తిప్పనపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు సింగరేణి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించాలన్నారు. చట్టాలపై పాఠశాల స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అసమానతలు లేని సమాజాన్ని స్థాపించాలంటే పిల్లలకు చిన్న వయస్సు నుంచి సమానత్వం గురించి తెలియజేయాలన్నారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ… బాధితులకు పరిహారం చెల్లింపులో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి నెల 30న పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. అట్రాసిటీ కేసుల్లో వెంటనే కేసులు నమోదు చేయాలని పోలీస్శాఖను ఆదేశించారు. కేసులకు సంబంధించి కుల ధ్రువీకరణ పత్రాలు తక్షణం జారీ చేయాలన్నారు. చండ్రుగొండ మండలంలో మరణించిన కుటుంబాల వారికి ఆపద్బంధు ద్వారా ఆర్థిక సాయం అందించామన్నారు. కమిటీ సభ్యులు సామాన్యనాయక్, లక్ష్మీబాయి మాట్లాడుతూ.. 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. సమావేశంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మణుగూరు ఏఎస్పీ శబరీశ్, ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారి అనసూయ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముత్యం పాల్గొన్నారు.