– కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు
– కొత్తగూడెం ఏరియాలో ముగిసిన సమ్మర్ కోచింగ్ క్యాంప్
రుద్రంపూర్, మే 25 : చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, అవి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శాలెం రాజు అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియాలో డబ్ల్యూపీఎస్ & జీఏ ఆధ్వర్యంలో 28 ఏప్రిల్, 2026 నుండి నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ సోమవారం విజయవంతంగా ముగిసింది. 25 రోజుల పాటు కొనసాగిన ఈ క్యాంప్ ముగింపు కార్యక్రమాన్ని రుద్రంపూర్లోని ఆర్సీఓఏ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామవరం, 3 ఇంక్లైన్ రెస్క్యూ స్టేషన్, రుద్రంపూర్, గౌతంపూర్, పీవీఎన్ఆర్ కాలనీ, సత్తుపల్లి ప్రాంతాల్లో అనుభవజ్ఞులైన కోచ్ల ఆధ్వర్యంలో ఫుట్బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్, హాకీ, కిక్ బాక్సింగ్ వంటి క్రీడల్లో ఎంతో మంది చిన్నారులు శిక్షణ పొందినట్లు తెలిపారు.
పిల్లలు తమ ప్రతిభ, నైపుణ్యాలతో క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న ప్రతి చిన్నారికి సింగరేణి తగిన ప్రోత్సాహం, చేయూత అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం క్యాంప్లో పాల్గొన్న చిన్నారులకు టీషర్టులు, షార్ట్లు పంపిణీ చేశారు. కోచ్లకు చెక్కులు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ నరసింహారావు, పర్సనల్ మేనేజర్ ఎల్.తిరుపతి, డివైపీఎం హరీష్, సీనియర్ పీఓ మజ్జి మురళి, యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఎం.డి.రజాక్, ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ గట్టయ్య, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ భీముడు, జనరల్ క్యాప్టెన్ బన్ను, కోఆర్డినేటర్ సాగర్, ఇతర అధికారులు, కోచ్లు, చిన్నారులు పాల్గొన్నారు.

‘క్రీడాకారులకు సింగరేణి చేయూత’