– ఆర్టీసీ కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు
– శంకర్ గౌడ్ ఆత్మహత్యా బాధాకరం
– ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య
రుద్రంపూర్ , ఏప్రిల్ 24 : సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం అత్యంత బాధాకరం అని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం కొత్తగూడెం బస్టాండ్ ఎదుట రెండో రోజు ఆర్టీసీ కార్మికుల ధర్నాలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని గత రెండు రోజులుగా శాంతియుతంగా పోరాటం చేస్తున్నారన్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు మనోవేదనకు గురై మనస్తాపం చెందుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి త్వరితగతిన వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
పోరాటాలతో తెలంగాణ సాధించుకున్నది తిరిగి సమస్యలతో ఆత్మ బలిదానాల కోసం కాదు పేర్కొన్నారు. కార్మిక సోదరులు దయచేసి ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ 12 ఏరియాలో ఆర్టీసీ కార్మికులకు అండగా నిలుస్తామని, ప్రభుత్వం తక్షణమే సమస్యను పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి, బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి, నాయకులు కత్తెర్ల రాములు, గాంధీ, మండల రాజేశ్వరరావు పాల్గొన్నారు.

‘ప్రాణాలు కాదు.. పరిష్కారం కావాలి’