– ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ బితున్ సింగ్
బూర్గంపహాడ్, ఏప్రిల్ 07 : గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు వరదలు, విపత్తుల సమయంలో అప్రమత్తంగా ఉండటమే కాకుండా ఆ విపత్తుల నుండి తప్పించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ టీఎన్ బితున్ సింగ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్, డీఎంహెచ్ఓ తుకారామ్ రాథోడ్, ఎంపీడీఓ జమలారెడ్డి, ఎస్ఐ మేడా ప్రసాద్, ఎంఈఓ యదుసింహరాజు, సర్పంచ్ మందా నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 16 బెటాలియన్లలో పని చేస్తున్న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) 140 కోట్ల జనాభాకే కాకుండా విదేశాల్లో కూడా విశేష సేవలందిస్తుందని ఇటీవల శ్రీలంకలో జరిగిన విపత్తులో ఎన్డీఆర్ఎఫ్ సహాయ, సహకారాలు అందించిందన్నారు.
విపత్తులు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆయా ప్రదేశాలకు చేరుకోవడం సాధ్యం కాదని, ఆ సమయంలో వరదలు, విపత్తులకు గురైన ప్రజలే అప్రమత్తంగా ఉండి ఆ విపత్తు నుంచి బయట పడేందుకు జాగ్రత్తలు పాటించాలని దీనికి అవగాహన ఎంతో అవసరమన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రమాదం సంభవించినప్పుడు ప్రజలను ఎలా కాపాడాలి.. హఠాత్తుగా గుండెపోటు వస్తే సీపీఆర్ ఎలా చేయాలి.. ప్రమాదాన్ని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రయోగాత్మకంగా వివరిస్తూ అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సులో డీటీ సమ్మయ్య, ఐటీడీఏ ఏఓ, పంచాయతీ కార్యదర్శి బర్ల ప్రభాకర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.