- 6 నుంచి వినియోగంలోకి నూతన విధానం
– పాత యాప్ల వినియోగంపై నిషేధం
– రైతులు ‘ఫార్మర్ ఐడీ’ నమోదు చేసుకోవడం తప్పనిసరి
జూలూరుపాడు, ఆగస్టు 05 : వ్యవసాయ రంగంలో పారదర్శకతను పెంచడం, సబ్సిడీ ఎరువుల పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్.ఎఫ్.ఎస్ నూతన యాప్ను ప్రవేశపెట్టిందని జూలూరుపాడు ఏఓ జి.దీపక్ ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుండి పాత యూరియా యాప్ వాడకం పూర్తిగా నిలిచిపోతుందని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యూరియా, డీఏపీ, ఎస్.ఎస్.పి, ఎంఓపీ, కాంప్లెక్స్ ఎరువుల విక్రయాలన్నీ ఇకపై ఈ నూతన ‘ఎఫ్.ఎఫ్.ఎస్’ యాప్ ద్వారానే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ విధానంలో ఎరువులు పొందేందుకు ప్రతి రైతు తప్పనిసరిగా ‘ఫార్మర్ ఐడీ’ నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వ్యవసాయ అధికారి వివరించారు. ఇప్పటి వరకు ఐడీ లేని రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి వెంటనే వివరాలు నమోదు చేయించుకోవాలని కోరారు. అలాగే రైతుల భూమి పట్టాదార్ పాసుపుస్తకం, ఆధార్ కార్డులకు అనుసంధానమైన మొబైల్ సంఖ్య ఆధారంగా ఓటీపీ ధ్రువీకరణ పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు.
రైతుల భూమి విస్తీర్ణం, సాగు చేసే పంటల ఆధారంగా వారికి అవసరమైన ఎరువుల కోటాను ముందస్తుగానే వ్యవస్థలో నమోదు చేస్తారని పేర్కొన్నారు. విక్రయ ప్రక్రియ గురించి వివరిస్తూ, ఎరువుల కొనుగోలు సమయంలో డీలర్ యాప్లో క్యూఆర్ కోడ్ లేదా టోకెన్ జారీ అవుతుందని, రైతు మొబైల్ సంఖ్యకు వచ్చే ఓటీపీ ధ్రువీకరణ పూర్తయిన తర్వాతే ఎరువుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఈ కొత్త విధానం వల్ల దళారుల ప్రమేయం తగ్గి, నకిలీ లావాదేవీలకు అడ్డుకట్ట పడుతుందని, నిజమైన అర్హులైన రైతులకు మాత్రమే సబ్సిడీ ఎరువులు సకాలంలో అందుతాయని పేర్కొన్నారు. ఇంకా వివరాలు నమోదు చేసుకోని రైతులు ఆలస్యం చేయకుండా వెంటనే ఏఈఓలను సంప్రదించి నమోదు పూర్తి చేసుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చని సూచించారు.