అశ్వారావుపేట:టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ 15న వరంగల్లో జరిగే విజయగర్జనసభకు వేలాదిగా పార్టీ కారకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు హాజరుకావాలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు పిలుపునిచ్చారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మండల కమిటీలు బాధ్యత తీసుకోవాలన్నారు. బుధవారం పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యతిధిగా హాజరైన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో ఉన్న అన్ని పంచాయతీలలోని గ్రామ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు పూర్తి బాధ్యత తీసుకుని ఒక్కొక్క కమిటీ నుంచి ఒక్క బస్సు ఏర్పాటు చేసుకోవాలన్నారు. విజయ గర్జనకు హాజరయ్యే కార్యకర్తలకు అన్ని సౌకర్యాలను మండల కమిటీలు, గ్రామ కమిటీలు చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల పార్టీ నాయకులు, జడ్పీటిసి, ఎంపీపీ, సర్పంచ్లు, సొసైటీ అధ్యక్షులు, పార్టీ అన్ని మండల కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.