లక్ష్మీదేవిపల్లి, మే 21 : వివిధ మండలాల నుండి ట్రాక్టర్లు, లారీల్లో వచ్చిన మొక్కజొన్న అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. లక్ష్మీదేవిపల్లి మండలం కొత్తగూడెం వ్యవసాయ కమిటీ మార్కెట్ను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్ యార్డులో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు, నిల్వలు, అన్లోడింగ్ ప్రక్రియలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వివిధ మండలాల నుంచి రైతులు మొక్కజొన్నతో మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన ట్రాక్టర్లు, లారీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కమిటీ గోడౌన్లలో అందుబాటులో ఉన్న నిల్వ సామర్థ్యం, గోడౌన్ల వినియోగం, రవాణా ఏర్పాట్లు, హమాలీల అందుబాటు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం వ్యవసాయ కమిటీ మార్కెట్లో సుమారు 2,500 మెట్రిక్ టన్నుల గోడౌన్ సామర్థ్యం అందుబాటులో ఉందని అధికారులు కలెక్టర్కు వివరించారు. సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, గుండాల మండలాలకు చెందిన మొక్కజొన్నను ఈ మార్కెట్కు మ్యాపింగ్ చేసినట్లు తెలిపారు. మార్కెట్ యార్డులో మొక్కజొన్న బస్తాల అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ వివిధ మండలాల నుండి వచ్చిన ట్రాక్టర్లు, లారీల అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఎక్కువసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి లేకుండా అవసరమైన హమాలీలు, యంత్ర సామగ్రి అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రస్తుతం సుమారు 110 మంది హమాలీలు విధుల్లో ఉన్నట్లు అధికారులు కలెక్టర్కు తెలిపారు. అవసరమైతే అదనపు హమాలీలను ఏర్పాటు చేసి కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు.

మొక్కజొన్న అన్లోడింగ్ను వేగంగా పూర్తి చేయాలి : కలెక్టర్ అంకిత్
మొక్కజొన్న బస్తాల తూకం, నిల్వ, రవాణా ప్రక్రియలను సమన్వయంతో నిర్వహించాలని, గోడౌన్లలో నిల్వలను శాస్త్రీయ పద్ధతుల్లో భద్రపరచాలని అధికారులకు సూచించారు. మార్కెట్ యార్డులో రైతులకు తాగునీరు, నీడ, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో తాసీల్దార్ శిరీష, వ్యవసాయ, మార్కెట్ శాఖ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.