South Coast Railway Zone | మధిర : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటివరకు ఉన్న మధిర రైల్వేస్టేషన్ ఇకపై దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి మారుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన డీపీఆర్లు సిద్ధం చేయాలని రైల్వే బోర్డును ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో ఏపీ విజయవాడ సమీపంలోని కొండపల్లి నుంచి తెలంగాణ పరిధిలోని బోనకల్లు మండలం మోటమర్రి రైల్వే స్టేషన్ వరకు 46 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మొత్తం రైల్వేస్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేయబోయే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వెళ్లనున్నాయి. దీంతో ఖమ్మం జిల్లాలో ఖమ్మం తర్వాత అతిపెద్ద రైల్వే స్టేషన్గా ఉన్న మధిర రైల్వే స్టేషన్, మోటమర్రి, తొండల గోపవరం, ఎర్రుపాలెం రైల్వే స్టేషన్లు ఇక నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వెళ్లనున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్నప్పుడు రైల్వే పనుల కోసం గతంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు సికింద్రాబాద్ వెళ్లేవారు. ఇప్పుడు మధిర నియోజకవర్గంలోని ప్రాంత ప్రజలు రైల్వే పనుల కోసం విజయవాడలోని డీఆర్ఎం కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుందని రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా కొండపల్లి నుంచి మోటమర్రి వరకు పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులందరూ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వెళ్లాల్సి ఉంది. వారి స్థానంలో కొత్త ఉద్యోగులు రానున్నారు.