– టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఏదులాపురం గోపాలరావు
జూలూరుపాడు, ఏప్రిల్ 25 : చికాగో అమరవీరుల త్యాగఫలంతో సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని, మేడే స్ఫూర్తితో లేబర్ కోడ్ల రద్దుకై కార్మిక వర్గం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు ఏదులాపురం గోపాలరావు పిలుపునిచ్చారు. శనివారం జూలూరుపాడు మండల పరిధిలోని వెంగన్నపాలెం గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి 140వ మేడే ఉత్సవాల గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న ఎనిమిది గంటల పని దినం చట్టాన్ని తుంగలో తొక్కి, కార్మికులను కట్టుబానిసలుగా మార్చేలా 12 గంటల పని విధానాన్ని తీసుకు రావాలని ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా చట్టాలను మారుస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చారని, దీనివల్ల కార్మికులకు కనీస వేతనం అందకపోవడమే కాకుండా సమ్మె చేసే హక్కును, ప్రశ్నించే హక్కును కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో ప్రశాంతంగా జీవిస్తున్న కార్మిక వర్గాన్ని కుల, మతాల పేరుతో విభజించి మనుషుల మధ్య తగాదాలు సృష్టించాలని చూస్తున్నారని, ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను కార్మికులు, ప్రజాస్వామ్యవాదులు సంఘటితమై తిప్పికొట్టాలని ఆయన కోరారు. నియంతలా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు కార్మిక వర్గం ఏకతాటిపైకి రావాలని, వాడవాడలా 140వ మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి జయప్రదం చేయాలని గోపాలరావు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కార్మికులపై మోపే భారాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో ప్రతి ఒక్కరూ ముందు వరుసలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వినోద్, నాగేష్, మధు, కనకమ్మ, అరుణ, లలిత, చందు, నాగయ్య, శ్రీదేవి, నరేష్, పద్మ, భవాని, నరసింహారావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.