– సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనుల పరిశీలన
– పడమటి నరసాపురం గిరిజన బాలికల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
జూలూరుపాడు, జూలై 22 : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్కు సంబంధించిన భూ సేకరణ సర్వే పనులను ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో వేగవంతంగా పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. జూలూరుపాడు మండలంలో జరుగుతున్న కెనాల్ భూ సేకరణ సర్వే పనులను బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే పురోగతిపై రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై ఆరా తీశారు. జూలూరుపాడు గ్రామ పరిధిలో మొత్తం 17.20 ఎకరాల భూమికి సర్వే చేపట్టాల్సి ఉందని, అందులో సుమారు 8 ఎకరాలు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూములు ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్కు వివరించారు.
అనంతరం కొత్తూరు గ్రామంలో కొనసాగుతున్న భూ సర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ మొత్తం 337 ఎకరాలకు సర్వే చేపట్టాల్సి ఉందని తెలుసుకుని, పనులను ప్రణాళికాబద్ధంగా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. భూ సర్వే ప్రక్రియలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. సర్వేకు అవసరమైన మార్కింగ్ పనులను ఒక్క రోజులో పూర్తి చేసి తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కెనాల్ వెడల్పును 50 మీటర్ల నుంచి 40 మీటర్లకు తగ్గించాలని స్థానిక రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. ప్రాజెక్టు డిజైన్ను సాంకేతికంగా పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.

భూ సర్వేను గడువులోగా పూర్తి చేయాలి : కలెక్టర్ అంకిత్
మండల పరిధిలోని పడమటి నరసాపురం గ్రామంలోని గిరిజన బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, వంటశాల, వసతి గదులు, పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉంచిన ఆహార పదార్థాల నాణ్యతను, కిచెన్ షెడ్లో పరిశుభ్రత ప్రమాణాలను స్వయంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ మెనూ ప్రకారం పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సిబ్బందిని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్.. అల్పాహారం, భోజనం అందుతున్న నాణ్యత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతేడాది పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించామని, ఈ విద్యా సంవత్సరం కూడా అదే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని ఉపాధ్యాయులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం, మెరుగైన వసతి కల్పించడంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని బాధ్యతగా తీసుకుని, ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తాసీల్దార్ శ్రీనివాస్, ఇరిగేషన్, సర్వే శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, రైతులు పాల్గొన్నారు.