బూర్గంపహాడ్, జూన్ 26 : బూర్గంపహాడ్ మండలంలోని పారిశ్రామికవాడగా ఉన్న సారపాక మేజర్ పంచాయతీలో ప్రజా పాలన ‘చెత్త’ పాలనగా మారింది. పారిశుధ్య పర్యవేక్షణలో అధికారుల పర్యవేక్షణ కొరవడినట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉన్న యువ సర్పంచ్ ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఒకవైపు ఉంటే మరోవైపు బదిలీపై వచ్చిన కార్యదర్శి పారిశుధ్య నిర్వహణ పట్టించుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులు, పర్యాటకులు, ప్రయాణీకులు భద్రాచలం-సారపాక బ్రిడ్జి మీదుగా పుణ్యక్షేత్రానికి వెళ్తుంటారని, అయితే ఈ జాతీయ రహదారి పక్కనే ఆటోల్లో చెత్తను తెచ్చి పారబోయడంతో దుర్వాసన వెదజల్లుతూ ప్రజల అనారోగ్యానికి కారణభూతాలుగా మారుతున్నాయని పలువురు మండిపడుతున్నారు.
ఐటీసీ కర్మాగారానికి వెళ్లే రహదారి మధ్యలో ఉన్న డివైడర్లో సైతం చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తుంది. మేజర్ పంచాయతీలో ఏ వీధి చూసినా చెత్తాచెదారం, డ్రైనేజీల్లో మురుగునీరు నిల్వ ఉండి దోమలు వ్యాప్తి చెందుతున్నాయనే ఆరోపణలూ లేకపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 99 రోజుల పల్లె ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టి పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించినా మేజర్ పంచాయతీ సారపాకలో మాత్రం అది అమలైనట్లుగా కనిపించలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సర్పంచ్, కార్యదర్శులు ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని, పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించాలని మేజర్ పంచాయతీ ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

సారపాకలో కొరవడిన పారిశుధ్య నిర్వహణ