రామవరం, నవంబర్ 12 : సత్తుపల్లిలో డిప్యూటేషన్పై పని చేస్తున్న కొంతమంది కార్మికుల డిప్యూటేషన్ రద్దుచేసి తిరిగి పివికే 5 గనికి పంపే ఆలోచనలో భాగంగా కేవలం ఎల్ హెచ్ డి నడపడానికి అధికారం ఉందన్న కారణంగా పనిగట్టుకుని, మరికొంతమందిని టార్గెట్ చేస్తున్నారనే వార్త ప్రచారం జరుగుతుందని హెచ్ఎంఎస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గడిపల్లి కృష్ణప్రసాద్ అన్నారు. ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు అధ్యక్షతన బుధవారం హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక పద్ధతి ప్రకారంగా కాకుండా డిప్యూటేషన్లో ఉన్న కార్మికులలో వీరిని మాత్రమే పిలవడం వెనక అంతరార్థం ఏమిటని, ఒకవేళ ఇలాంటి చర్యలు చేపడితే సహించేది లేదన్నారు.
సంవత్సరాల తరబడి అక్కడ పని చేస్తున్న కార్మికులకు అక్కడే ఉద్యోగం నిర్వహించే అవకాశం కల్పించాలని హెచ్ఎంఎస్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నామన్నారు. టెక్నీషియన్లకు పారదర్శకత లేని సర్ఫేస్ కౌన్సిలింగ్ నిర్వహించడం వల్ల కార్మికుల్లో వ్యతిరేకత రావడంతో దానిని సరిచేసి భర్తీ చేయాల్సిన అధికారులు ఎవరో నాయకులు ఒప్పుకోవట్లేదట వారు ఒప్పుకుంటే చేస్తామని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇకనైనా ఇలాంటి చర్యలు మానుకుని వెంటనే ఆరోజు ఇచ్చిన సర్కులర్ ప్రకారంగా ఆఫీస్ ఆర్డర్లను ఇష్యూ చేయాలని హెచ్ఎంఎస్ యూనియన్గా డిమాండ్ చేయడం జరిగిందన్నారు.
అంతేకాకుండా డిప్యూటేషన్ల విషయానికొస్తే డిప్యూటేషన్ దందాకు చరమగీతం పడాల్సిన మేనేజ్మెంట్ పైరవీకారులకు వత్తాసు పలుకుతూ డిప్యూటేషన్ల పరంపర కొనసాగిస్తూనే ఉందన్నారు. సర్ఫేస్ ఖాళీలను భర్తీ చేయకుండా డిప్యూటేషన్ లకు వంత పాడడం ఏంటని, ఇకనైనా డిప్యుటేషన్ దందాను మానుకోవాలని వెంటనే పర్మినెంట్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి సర్ఫేస్ పోస్టులను భర్తీ చేయాలని లేకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ ఆసిఫ్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, ఆర్ సి హెచ్ పి పిట్ సెక్రెటరీ పూర్ణచందర్, హెచ్ఎంఎస్ సీనియర్ నాయకులు సత్యనారాయణ, సత్తుపల్లి సమంత, పిట్ సెక్రెటరీ నరసింహారావు, పి వి కే ఫై అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ నవీన్, నాయకులు కన్వీనర్ గౌస్, సాయి సందీప్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ హమీద్, ఇతర నాయకులు పాల్గొన్నారు.