తెలంగాణపై పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై సబ్బండ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిలో భాగంగా బుధవారం కొత్తగూడెం జిల్లాకేంద్రంలో టీజీవోస్, టీఎన్జీవోస్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.. కలెక్టరేట్తో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రజలు, ఉద్యోగులు కలిసి సాధించుకున్న రాష్ట్రంపై అనుచిత వ్యాఖ్యలు తగవు అని హెచ్చరించారు.
కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 10: తెలంగాణపై పార్లమెంట్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఎన్జీవోస్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో సంస్థ ఉద్యోగులు, టీజీవోస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. 42 రోజులు తెలంగాణ ప్రజానీకం మమేకమై ఏకకంఠంతో ‘జై తెలంగాణ’ నినాదంతో పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంపై పార్లమెంట్లో ప్రధాని చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అమరనేని రామారావు, సాయిభార్గవ్ చైతన్య, టీజీవోస్ నేతలు పాల్గొన్నారు.