రుద్రంపూర్, మార్చి 26 : చుంచుపల్లి మండలం 4 ఇన్క్లైన్ పంచాయతీ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉన్న కూడలిలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు పగలు-రాత్రి తేడా లేకుండా నిరంతరం వెలుగుతుండడంతో పంచాయతీ నిధులు వృథా అవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో ఆ ప్రాంతం చీకటిగా ఉండడంతో ప్రజలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని భావించిన సింగరేణి యాజమాన్యం సుమారు లక్ష రూపాయల వ్యయంతో లైటింగ్ టవర్ను ఏర్పాటు చేసి, వీధి దీపాలను అమర్చి పంచాయతీకి అప్పజెప్పింది.
అయితే ప్రస్తుతం ఆ లైట్లు 24 గంటలు వెలిగిపోతుండటం గమనార్హం. పగలు సమయంలో కూడా వాటిని ఆపేలా ఎవరూ చూడకపోవడంతో విద్యుత్ వినియోగం పెరిగి, వీధిలైట్ల బిల్లుల భారం పంచాయతీపై పడుతున్నదని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయంపై పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, పాలకవర్గ సభ్యులు స్పందించి పగలు సమయంలో లైట్లు ఆపి, రాత్రి వేళల్లో మాత్రమే వెలిగే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.