Vehicle Age limit : కమర్షియల్ ఎలక్ట్రిక్ (Electric), హైడ్రోజన్ (Hydrozen), సీఎన్జీ (CNG) వాహనాల ఏజ్ లిమిట్ (Vehicles Age Limist) పై కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక ప్రతిపాదన చేసింది. జాతీయ పర్మిట్ (National Permit) పరిధిలో ఉన్న ఈ వాహనాల గరిష్ఠ వయసును మరో ఐదేళ్లు పెంచాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించి కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ (Draft Notification) విడుదల చేసింది.
ప్రస్తుతం జాతీయ పర్మిట్ పరిధిలోని కొన్ని వాణిజ్య వాహనాలకు 12 ఏళ్లు, మరికొన్ని వాహనాలకు 15 ఏళ్ల వయోపరిమితి ఉంది. కేంద్ర ప్రతిపాదన అమల్లోకి వస్తే ఎలక్ట్రిక్, హైడ్రోజన్, సీఎన్జీ వాహనాలకు ఈ పరిమితి వరుసగా 17 ఏళ్లు, 20 ఏళ్లకు పెరగనుంది. అయితే ఈ సడలింపు అన్ని కమర్షియల్ వాహనాలకు వర్తించదు. బ్యాటరీ, హైడ్రోజన్, సహజ వాయువుతో నడిచే వాటికే పరిమితం కానుంది. కాలుష్యాన్ని తగ్గించే వాణిజ్య రవాణాను ప్రోత్సహించడంలో భాగంగానే ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.
జాతీయ పర్మిట్ ఉన్న వాహన యజమానులకు మరో వెసులుబాటును కూడా కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం ప్రతి ఏడాది పర్మిట్ ఆథరైజేషన్ పునరుద్ధరించుకోవాల్సి ఉండగా.. ఇకపై ఒకేసారి ఐదేళ్లకు తీసుకునే అవకాశం కల్పించనుంది. వార్షిక రుసుము రూ.16,500గానే ఉంటుంది. ఐదేళ్లకు మొత్తం రూ.82,500 చెల్లించాల్సి ఉంటుంది. వాహనాలకు సంబంధించిన పత్రాల ప్రక్రియను కూడా సులభతరం చేయాలని కేంద్రం భావిస్తోంది. వాహన డేటాబేస్ను ఉపయోగించడం ద్వారా పేపర్ వర్క్ను తగ్గించనుంది.
తాత్కాలిక రిజిస్ట్రేషన్ నిబంధనల్లోనూ మార్పులు ప్రతిపాదించింది. బాడీ అమర్చని చాసిస్కు ఆరు నెలల తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఇవ్వనున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో దాన్ని ఒక్కోసారి 30 రోజులు చొప్పున పొడిగించే అవకాశం ఉంటుంది. ఈ ముసాయిదా నిబంధనలపై ప్రజలు, సంబంధిత వర్గాల నుంచి అభ్యంతరాలు, సూచనలు కోరారు. నోటిఫికేషన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తేదీ నుంచి 30 రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది.