– ఎండల తీవ్రత నుండి ప్రజలకు ఉపశమనం
జూలూరుపాడు, జూన్ 02 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలకు, ఉక్కపోతకు తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలకు ఈ వర్షం పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. మండల పరిధిలోని పడమట నరసాపురం, కొమ్మగూడెం, కాకర్ల, గుండెపూడి, అనంతారం, వినోబా నగర్ తదితర గ్రామాల్లో విస్తారంగా వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. చల్లటి ఈదురుగాలులు వీచడంతో ఎండల తీవ్రత పూర్తిగా తగ్గిపోయింది. అయితే, ఈదురుగాలుల కారణంగా అక్కడక్కడా చెట్ల కొమ్మలు విరిగిపడటంతో పాటు విద్యుత్ సరఫరాకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఎండ వేడిమితో అల్లాడిపోయిన జనం, ఈ అకాల వర్షంతో ఊపిరి పీల్చుకున్నారు. పొడి దుక్కులు దున్నిన రైతులకు ఈ వర్షం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని రైతులు పేర్కొంటున్నారు.